CWC | ఢిల్లీ: భారత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచ కప్లో క్రికెట్ అభిమానులను మరింత ఉత్సాహపరిచేందుకు కోకాకోలా, ఐసీసీ సంయుక్తంగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడేందుకు కంకణం కట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 5న మెగాటోర్నీ ఆరంభ మ్యాచ్ సమయంలో కోకాకోలా కంపెనీకి చెందిన ప్లాస్టిక్ బాటిళ్లతో తయారు చేసిన పది దేశాలకు చెందిన జాతీయ జెండాలను రూపొందించాయి. మ్యాచ్ ప్రారంభ సమయానికి ముందు జాతీయ గీతాలాపన సందర్భంగా ఈ జెండాలను ఉపయోగిస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం పెరుగుతున్న ఈ కాలంలో కోకాకోలా ఇండియా 10 దేశాల జాతీయ పతాకాలను, ఐసీసీ 10 యూనిటీ జెండాలను తయారుచేసింది. తద్వారా క్రికెట్లో రీసైకిల్డ్ బాటిళ్లతో రూపొందించిన జెండాలను తయారుచేసిన తొలి కంపెనీగా కోకాకోలా ఇండియా గుర్తింపు సాధించింది. ఒక్క జాతీయ జెండా తయారీకి సుమారు 11,000 బాటిళ్లు, ఒక్క ఐసీసీ యూనిటీ జెండా తయారీకి 2వేల బాటిళ్లను ఉపయోగించారు. రీసైకిల్డ్ దుస్తులకు పేరొందిన గో రివైజ్ బై గణేషా ఎకోవర్స్ లిమిటెడ్ ఈ జెండాలను రూపొందించింది. దాదాపు 100 మంది 300 గంటలు కష్టపడి 25 రోజుల్లో ఈ జెండాలను తయారు చేశారు.