RCB to Playoffs | ఢిల్లీ క్యాపిటల్ సారధి రిషబ్పంత్ అనాలోచిత నిర్ణయాలకు భారీ మూల్యమే చెల్లించాడు. గెలుస్తుందనుకున్న మ్యాచ్ను ముంబై ఇండియన్స్ (ఎంఐ) అలవోకగా గెలిచింది. 20 ఓవర్లలో 160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ చివరి ఓవర్లో ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయ తీరాలకు చేరుకున్నది. ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ కేవలం రెండు పరుగులకే ఔటయినా ఓపెనర్ ఇషాన్ కిషాన్ 48 పరుగులు, డేవడ్ బ్రెవిస్ 37, టిమ్ డేవిడ్ 34, తిలక్ వర్మ 21 పరుగులు చేశారు. టిమ్ డేవిడ్, తిలక్ వర్మ నిలకడగా ఆడుతూ జట్టు విజయానికి కారణం అయ్యారు. అనిరిచ్ నార్ట్జే, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు. ఢిల్లీ క్యాపిటల్స్ సారధి రిషబ్ పంత్.. క్యాచ్ మిస్ కావడం, తర్వాత డీఆర్ఎస్కు వెళ్లకపోవడంతో భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్పై ముంబై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందడంతో ఈ ఏడాది ఫ్లే ఆఫ్స్కు బెంగళూరుకు బెర్త్ ఖరారైంది.
అంతకుముందు ముంబై ఇండియన్స్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ 160 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ (ఎంఐ) బౌలర్లు ఆచితూచి బౌలింగ్ చేయడంతో ఢిల్లీ జట్టులో టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ల వెన్ను విరవడంలో జస్ప్రీత్ బుమ్రా కీలకంగా వ్యవహరించాడు. ఓపెనర్ పృథ్వీషా, సారధి రిషబ్ పంత్, రోమెన్ పావెల్ మాత్రమే పెవిలియన్లో కుదురుగా నిలబడగలిగారు. పృథ్వీ షా 24 పరుగులకు బుమ్రా బౌలింగ్లో ఇషాన్ కిషాన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరుకున్నాడు. బుమ్రా, ఇషాన్ కిషాన్, డానియల్ శ్యామ్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ముగ్గురు బ్యాట్స్మెన్లు క్రీజ్ను వీడక తప్పలేదు. బుమ్రా బౌలింగ్లో రోహిత్శర్మ క్యాచ్ పట్టడంతో మిచైల్ మార్ష్ గోల్డ్ డకౌట్ అయ్యాడు.
ఆ తర్వాత రోమన్ పావెల్, రిషబ్ పంత్ నిలకడగా ఆడుతూ జట్టు స్కోర్ పెంచడానికి ప్రయత్నించారు. రోమన్ పావెల్ మాత్రమే 43 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో బౌల్డయి పెవిలియన్కు చేరుకున్నాడు. సారధి రిషబ్ పంత్ 19 పరుగులకు రమన్దీప్ సింగ్ బౌలింగ్లో ఇషాన్ కిషాన్కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత అక్సర్ పాటిల్ 19 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.