ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నైకి ముంబై దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చింది. గత మ్యాచ్లో తమకు ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలను తుడిచిపెట్టింది. స్కోరింగ్ మ్యాచ్లో ముంబై భారీ విజయాన్నందుకుంది. సామ్స్ విజృంభణతో 97 పరుగులకే కుప్పకూలిన చెన్నై..ముంబైని ప్రతిఘటించినా లాభం లేకపోయింది. హైదరాబాద్ కుర్రాడు ఠాకూర్ తిలక్వర్మ సమయోచిత బ్యాటింగ్తో ముంబై గెలుపు తీరాలకు చేరింది. 15 ఏండ్ల సుదీర్ఘ ఐపీఎల్ చరిత్రలో ముంబై, చెన్నై ప్లేఆఫ్స్ బెర్తు దక్కించుకోకపోవడం ఇదే తొలిసారి.
ముంబై: ‘బండ్లు ఓడలు అవుతాయి..ఓడలు బండ్లు అవుతాయి’ ఈ నానుడి ముంబై, చెన్నై జట్లకు సరిగ్గా సరిపోతుంది. లీగ్లో అత్యధిక సార్లు ట్రోఫీలు దక్కించుకున్న ఈ రెండు జట్లు పేలవ ఆటతీరుతో తగిన మూల్యం చెల్లించుకోగా.. అసలు అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్లు వరుస విజయాలతో దూసుకెళుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. గురువారం జరిగిన మ్యాచ్లో ముంబై 5 వికెట్ల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుందామనుకున్న ధోనీసేన స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చలేకపోయింది. లీగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుస ఓటములతో కూనరిల్లుతున్న ముంబై.. వెళ్తూ వెళ్తూ.. చెన్నైని తన వెంట పెట్టుకుపోయింది. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్కు దిగిన చెన్నై 16 ఓవర్లలో 97 పరుగులకు కుప్పకూలింది. ఓవరాల్గా లీగ్లో చెన్నైకి ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం విశేషం. ఇన్నింగ్స్ మొదలైన కొద్దిసేపటికే చెన్నై 5 పరుగులకు కాన్వె(0), అలీ(0), ఊతప్ప(1)వికెట్లను కోల్పోయింది. ముంబై స్పీడ్స్టర్ సామ్స్(3/16) చెన్నైని ఆదిలోనే కోలుకోలేని దెబ్బ తీశాడు.
ఓవైపు ఫ్లడ్లైట్ల సమస్యతో విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో ఔట్లపై తొలి రెండు ఓవర్ల వరకు చెన్నైకి డీఆర్ఎస్కు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ముంబై బౌలర్ల నిలకడైన ప్రదర్శనతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన కింగ్స్..ఏక్కడా కోలుకోలేకపోయింది. మిడిలార్డర్లో కెప్టెన్ ధోనీ(36 నాటౌట్) ఒంటరిపోరాటం చేసినా లాభం లేకపోయింది. నాయకునికి సరైన సహకారం లభించకపోవడంతో అవతలి ఎండ్లో వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. రిలే మెరిడిత్(2/27), కార్తికేయ(2/22) ఆకట్టుకున్నారు. లక్ష్యఛేదనకు దిగిన ముంబై 14.5 ఓవర్లలో 103/5 స్కోరు చేసింది. తొలి ఓవర్లో ఓపెనర్ ఇషాన్ కిషన్(6) వెనుదిరుగగా, కెప్టెన్ రోహిత్శర్మ(18) పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. హైదరాబాదీ బ్యాటర్ తిలక్వర్మ(34 నాటౌట్) సాధికారిక ఇన్నింగ్స్తో జట్టుకు విజయాన్ని అందించాడు. చూడచక్కని షాట్లతో అలరించి ఆకట్టుకున్నాడు. ముకేశ్ చౌదరి(3/23) రాణించాడు. మూడు కీలక వికెట్లతో చెన్నైని కుప్పకూల్చిన సామ్స్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 16 ఓవర్లలో 97 ఆలౌట్(ధోనీ 36 నాటౌట్, బ్రావో 12, సామ్స్ 3/16, కార్తీకేయ 2/22), ముంబై: 14.5 ఓవర్లలో 103/5 (తిలక్వర్మ 34 నాటౌట్, రోహిత్ 18, ముకేశ్ చౌదరి 3/23, అలీ 1/17)