సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన ముంబై ఇండియన్స్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి టైటిల్ కైవసం చేసుకుంది. చివరి ఓవర్ వరకు హోరాహోరీగా సాగిన తుదిపోరులో ఢిల్లీని చిత్తుచేసిన ముంబై సగర్వంగా ట్రోఫీ అందుకుంది. మొదట బౌలింగ్లో మాథ్యూస్, వాంగ్ ఢిల్లీ పనిపట్టగా.. బ్యాటింగ్లో స్కీవర్తో పాటు హర్మన్ప్రీత్ కౌర్ చెలరేగింది.
ముంబై: సీజన్ ఆరంభం నుంచి నిలకడగా రాణించిన ముంబై ఇండియన్స్ జట్టు.. మహిళల ప్రీమియర్ లీగ్ తొలి టైటిల్ చేజిక్కించుకుంది. ఆదివారం ఇక్కడి బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ముంబై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.
కెప్టెన్ మెగ్ లానింగ్ (35; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా.. చివర్లో శిఖ పాండే (17 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్), రాధ యాదవ్ (12 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విలువైన పరుగులు జోడించారు. ముంబై బౌలర్లలో హీలీ మాథ్యూస్ నాలుగు ఓవర్లలో రెండు మెయిడిన్లు వేసి ఐదు పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టగా.. ఇస్సీ వాంగ్ 3, అమెలియా కెర్ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. స్కీవర్ బ్రంట్ (55 బంతుల్లో 60 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో రాణించగా.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (37; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడింది.
ఢిల్లీ: 20 ఓవర్లలో 131/9 (లానింగ్ 35, రాధ 27*; హీలీ మాథ్యూస్ 3/5, ఇస్సీ వాంగ్ 3/42), ముంబై: 19.3 ఓవర్లలో 134/3 (స్కీవర్ బ్రంట్ 60 నాటౌట్, హర్మన్ 37; రాధ 1/24).
విజేత ముంబై ఇండియన్స్ 6 కోట్లు
రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ 3 కోట్లు