MI vs UPW : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఆరంభం నుంచి ఆదరగొడుతున్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫైనల్లో అడుగుపెట్టింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ముంబై ఎలిమినేటర్ మ్యాచ్లో యూపీ వారియర్స్(UP Warriorz)పై భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్లో, ఆ తర్వాత బౌలింగ్లో రాణించిన ముంబై 72 పరుగుల తేడాతో యూపీని చిత్తుగా ఓడించింది. ఇసీ వాంగ్(Issy Wong) హ్యాట్రిక్ వికెట్లతో యూపీని దెబ్బ కొట్టింది. అద్భుత విజయంతో హర్మన్ప్రీత్ సేన మార్చి 26న జరిగే టైటిల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్తో అమీతుమీ సిద్ధమైంది. ఏమాత్రం పోటీ ఇవ్వని యూపీ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 182 రన్స్ చేసింది. ప్రధాన బ్యాటర్లు విఫలమైనా, నాట్ సీవర్ బ్రంట్ (72) అర్ధ శతకంతో చెలరేగింది. భారీ లక్ష్య ఛేదనలో యూపీ వారియర్స్ ఆది నుంచే తడబడింది. అలిసా హీలీ (11), తహ్లియా మెక్గ్రాత్(7), గ్రేస్ హ్యారిస్ (14) స్వల్ప స్కోర్కే వెనుదిరిగారు. కిరణ్ నవగిరే (43), దీప్తి శర్మ (16) మాత్రమే పోరాడారు.
వీళ్లు ఔటయ్యాక యూపీ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. 17.4 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో ఇసీ వాంగ్ నాలుగు వికెట్లు తీసింది. సైకా ఇషాక్ రెండు , సీవర్ బ్రంట్, అమేలియా, జింతిమన్ కలికా తలా ఒక వికెట్ తీశారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ 8 రన్స్ వద్ద తొలి వికెట్ కోల్పోయింది. శ్వేతా షెరావత్(1)ను సైకా ఇషాక్ ఔట్ చేసింది. ఆ తర్వాతి ఓవర్లో అలిసా హీలీ (11) ఔటయ్యింది. 12 రన్స్కే రెండు వికెట్లు పడిన దశలో.. కిరణ్ నవగిరే(43), తహ్లియా మెక్గ్రాత్ (7) ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ, అమన్జోత్ కౌర్ త్రోకు మెక్గ్రాత్ రనౌట్ అయింది. దాంతో, 21 పరుగులకే కీలకమైన వికెట్లు పడ్డాయి. దాంతో, కిరణ్, గ్రేస్ హ్యారిస్ (14) దీప్తి శర్మ (16)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకుంది. సైకా ఇషాక్, అమేలియా ఓవర్లో చెలరేగి ఆడింది. కానీ, ఇసీ వాంగ్ 13వ ఓవర్లొఓ హ్యాట్రిక్ తీయడంతో యూపీ మరింత కష్టాల్లో పడింది. రెండో బంతికి కిరణ్, మూడో బంతికి సిమ్రాన్, నాలుగో బంతికి ఎకిల్స్టోన్ను వాంగ్ ఔట్ చేసింది. దాంతో, 84 రన్స్కే యూపీ 7 వికెట్లు పడ్డాయి. మరికాసేపటికే దీప్తి శర్మ వెనుదిరిగింది. దాంతో, యూపీ ఓటమి ఖరారైంది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు కొట్టింది. నాట్ సీవర్ బ్రంట్ (72) హాఫ్ సెంచరీతో చెలరేగింది. చివర్లో అమేలియా కేర్(29), పూజా వస్త్రాకర్ (11) ధాటిగా ఆడారు. ఓపెనర్ యస్తికా భాటియా(21), హేలీ మాథ్యూస్ (26) స్వల్ప స్కోర్కే పెవిలియన్ చేరారు. ఫామ్లో ఉన్న హర్మన్ప్రీత్ కౌర్(14) విఫలమైంది. బ్రంట్, అమేలియా నాలుగో వికెట్కు 60 రన్స్ రాబట్టారు. 13వ ఓవర్లో హర్మన్ప్రీత్(14)ను ఎకిల్స్టోన్ బౌల్డ్ చేసింది. దాంతో, 104 రన్స్ వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్రంట్ బౌండరీలతో యూపీ బౌలర్లపై విరుచుకుపడింది. 24 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్తో ఫిఫ్టీ బాదింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్స్టోన్ రెండు వికెట్లు తీసింది. అంజలి సర్వానీ, పర్షవీ చోప్రాకు ఒక్కో వికెట్ దక్కింది.