దేశవాళీల్లో పరుగుల వరద పారిస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్తో జరగనున్న రెండో టెస్టు కోసం సెలెక్షన్ కమిటీ సర్ఫరాజ్ను ఎంపిక చేసింది. రాహుల్, జడేజా గాయాలతో జట్టుకు దూరమవడంతో.. రంజీల్లో టన్నుల కొద్ది పరుగులు చేసిన సర్ఫరాజ్కు అవకాశం ఇచ్చింది. స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్తో పాటు.. నిన్న మొన్నటి వరకు టీమ్ఇండియా నెట్బౌలర్గా కొనసాగిన లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్ను జట్టులో చేర్చింది.
Sarfaraz Khan | హైదరాబాద్: మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల కోసం సెలెక్షన్ కమిటీ గతంలోనే జట్టును ప్రకటించగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాలతో విశాఖపట్నం మ్యాచ్కు దూరమవడంతో సోమవారం తాజాగా జట్టును సవరించింది. ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో ఓడిన టీమ్ఇండియా.. రెండో మ్యాచ్తో లెక్క సరిచేయాలని చూస్తున్నది. మడమ గాయంతో జడేజా, తొడ గాయంతో రాహుల్ జట్టుకు దూరం కావడంతో సెలక్షన్ కమిటీ సర్ఫరాజ్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్ను జట్టులో చేర్చింది. ‘రాహుల్, జడేజా గాయాల వల్ల వైజాగ్లో జరగనున్న రెండో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. తొలి పోరులో పరుగు తీస్తున్న సమయంలో జడేజా మడమ కండరం పట్టేసింది. తొడ కండరాల నొప్పి కారణంగా రాహుల్ విశ్రాంతి కోరాడు. వైద్యబృందం ఎప్పటికప్పుడు ఇద్దరినీ పర్యవేక్షిస్తున్నది. వీరి స్థానంలో సర్ఫరాజ్, సౌరభ్, సుందర్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది’ అని బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత్, ఇంగ్లండ్ మధ్య వచ్చే నెల 2 నుంచి విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
ఇంగ్లండ్తో సిరీస్లో తొలి రెండు మ్యాచ్లకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో.. అతడి స్థానాన్ని భర్తీ చేసే సమయంలోనే సర్ఫరాజ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే సెలెక్షన్ కమిటీ మాత్రం రజత్ పాటిదార్కు అవకాశం ఇచ్చింది. అదే సమయంలో ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో భారత్-‘ఎ’ జట్టు తరఫున సర్ఫరాజ్ భారీ సెంచరీతో చెలరేగి.. ఇప్పుడు తనను ఎంపిక చేయక తప్పని పరిస్థితి కల్పించాడు. సీనియర్లు చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేకు మరో అవకాశం ఇస్తారని ఊహించినా.. సెలక్షన్ కమిటీ మాత్రం యువ ఆటగాళ్ల వైపే మొగ్గుచూపింది. సుదీర్ఘ ఇన్నింగ్స్లకు పెట్టింది పేరైన సర్ఫరాజ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 45 మ్యాచ్ల్లో 3,912 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు ఉన్నాయి. భారత టెస్టు జట్టు ఎంపిక జరిగిన ప్రతిసారీ.. రంజీల్లో మంచినీళ్ల ప్రాయంలా పరుగులు చేస్తున్న సర్ఫరాజ్ పేరు బలంగా వినిపించేది. అయితే ఫిట్నెస్, ప్రవర్తన కారణంగా పోటీలో వెనుకబడిన ఈ ముంబైకర్ ఎట్టకేలకు జాతీయ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. స్పిన్ను సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు.. ఇన్నింగ్స్కు ఇరుసులా నిలబడగల సత్తాఉన్న సర్ఫరాజ్ రెండో టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకుంటాడా చూడాలి!
2021లో ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు వచ్చిన సమయంలో నెట్బౌలర్గా ఉన్న సౌరభ్ కుమార్.. ఈసారి మెయిన్ప్లేయర్గా ఎంపికయ్యాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ 30 ఏండ్ల ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమే అయినా.. సీనియర్ల సహచర్యంలో ఎదిగేందుకు చక్కటి అవకాశం దక్కినైట్లెంది. ‘భారత జట్టుకు ఎంపికవడం నా కల. అది సాధ్యమైనందుకు ఆనందంగా ఉంది. ఈ అవకాశం కోసం దేశంలో ఎందరో యువకులు ఎదురు చూస్తూ ఉంటారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోబోతున్నాననే భావన నన్ను నిలువనివ్వడం లేదు’ అని సౌరభ్ పేర్కొన్నాడు.
రోహిత్ (కెప్టెన్), గిల్, యశస్వి, శ్రేయస్, భరత్, ధ్రువ్, అశ్విన్, అక్షర్, కుల్దీప్, సిరాజ్, ముఖేశ్, బుమ్రా, అవేశ్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్, సుందర్, సౌరభ్.