ముంబై మళ్లీ మెరిసింది. దేశవాళీ క్రికెట్పై మరోమారు తనదైన ముద్రవేస్తూ ముంబై 42వ సారి రంజీ ట్రోఫీ టైటిల్ను సగర్వంగా ముద్దాడింది. గత 90 ఏండ్లలో 48వసారి ఫైనల్ చేరిన ముంబై రంజీ కింగ్గా అవతరించింది. ఆఖరి రోజు వరకు ఆసక్తికరంగా సాగిన తుది పోరులో విదర్భ తుదికంటా పోరాడినా..ముంబై అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. సరిగ్గా ఎనిమిదేండ్ల తర్వాత రంజీ ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. టైటిల్ గెలిచి ధవల్ కులకర్ణికి ఘనంగా వీడ్కోలు పలికింది. దీటుగా పోరాడిన విదర్భ రన్నరప్తో సరిపెట్టుకుంది.
Ranji Trophy | ముంబై: దేశవాళీ క్రికెట్లో అత్యున్నత ట్రోఫీగా పేరు గాంచిన రంజీ ట్రోఫీలో ముంబై విజేతగా నిలిచింది. ఐదు రోజుల పాటు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో ముంబై 169 పరుగుల తేడాతో విదర్భపై చిరస్మరణీయ విజయం సాధించింది. 538 పరుగుల భారీ లక్ష్యఛేదన కోసం ఓవర్నైట్ స్కోరు 248/5 ఐదో రోజు ఆట కొనసాగించిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అక్షయ్ వాడ్కర్(199 బంతుల్లో 102, 9ఫోర్లు, సిక్స్), హర్ష్ దూబే(128 బంతుల్లో 65, 5ఫోర్లు, 2సిక్స్లు) పోరాటం చేసినా విదర్భ విజయతీరాలకు చేరలేకపోయింది. తనుశ్ కొటియాన్(4/95) నాలుగు వికెట్లతో విజృంభించగా, తుషార్, ముషీర్ఖాన్ రెండేసి వికెట్లు తీశారు. తన కెరీర్లో చివరి రంజీ మ్యాచ్ ఆడిన ధవల్ కులకర్ణి(1/38) ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ముషీర్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, తనుశ్ కొటియాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ దక్కాయి.
వాడ్కర్, దూబే పోరాడినా : ముంబైకి విదర్భ దీటుగా సమాధానమిచ్చే ప్రయత్నం చేసింది. వాడ్కర్ ముంబై బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. ఈ క్రమంలో తొలి సెషన్లో వికెట్ కోల్పోని విదర్భ.. వాడ్కర్ నిష్క్రమణతో వెంటవెంటనే వికెట్లు చేజార్చుకుంది. ఉమేశ్యాదవ్(6)ను క్లీన్బౌల్డ్ చేయడం ద్వారా కులకర్ణి..విదర్భ ఇన్నింగ్స్కు ముగింపు పలికాడు.
రికార్డు స్థాయిలో 42వ సారి రంజీ టైటిల్ గెలిచిన తమ జట్టుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ 5 కోట్ల ప్రైజ్మనీ ప్రకటించింది. సాధారణం కంటే ఇది రెట్టింపు అని అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలె పేర్కొన్నాడు.