Mitchell Marsh | వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ (World Cup trophy) పట్ల అవమానకరంగా ప్రవర్తించి.. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి, చేతిలో బీరు బాటిల్తో ఉన్న మార్ష్ ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో అతడి తీరుపై క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అతడిపై భారత్లో ఏకంగా కేసు కూడా నమోదైంది. కాగా, ఘటన జరిగిన 12 రోజులకు ట్రోఫీ వివాదంపై మార్ష్ స్పందించాడు. తాను చేసిన ఈ చర్యను సమర్థించుకున్నాడు.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మార్ష్ మాట్లాడుతూ.. ‘ప్రపంచకప్పై కాళ్లు పెట్టి నేను దిగిన ఫొటోలో ఎలాంటి అగౌరవం నాకు కనిపించలేదు. నేను ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించలేదు. అది వైరల్ అయ్యిందని కొందరు నాకు చెబుతున్నప్పటికీ నేను సోషల్ మీడియాలో దానిని పెద్దగా చూడలేదు. అందులో ఏమీ లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మార్ష్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇటీవలే భారత్లో జరిగిన ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియాపై ఆస్ట్రేలియా గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రోఫీ బహూకరణ అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో మార్ష్ సోఫాలో కూర్చొని ప్రపంచ కప్ ట్రోఫీపై కాళ్లు ఆనించాడు. అంతే కాదు చేతిలో బీరు బాటిల్ కూడా పట్టుకున్నాడు. ఈ ఫొటో బైటకు రావడంతో అతడిపై క్రికెట్ అభిమానులు, నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచకప్ను ఎంతో గొప్పగా భావించే వారంతా ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఇంత అహంకారమా అంటూ మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ (UP)కు చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్ పండిట్ కేశవ్ ( RTI activist Pandit Keshav).. మార్ష్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడు ట్రోఫీని అవమానించడమే కాక.. 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేశవ్ ఫిర్యాదును స్వీకరించిన ఉత్తరప్రదేశ్ అలీగఢ్ (Aligarh) పోలీసులు మార్ష్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read..
India Vs Australia | భారత్ ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్కి కరెంటు కష్టాలు.. స్టేడియంలో పవర్ కట్
AB de Villiers | జనవరిలో దక్షిణాఫ్రికా టీ20 లీగ్.. ప్రచారకర్తగా డివిలియర్స్