India Vs Australia | భారత్ – ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య జరిగే నాలుగో టీ20 మ్యాచ్కు కరెంట్ కష్టాలు ఎదురయ్యాయి. మ్యాచ్ ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందు స్టేడియంలో కరెంట్ కోతలు ఇబ్బంది పెడుతున్నాయి. గత 14 ఏళ్లుగా బిల్లులు కట్టకపోవడంతో స్టేడియానికి కరెంట్ కనెక్షన్ తీసేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు జరిగే స్టేడియంలో ఈ పరిస్థితి తలెత్తడంపట్ల క్రికెట్ సంఘాలు, అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం (Shaheed Veer Narayan Singh stadium)లో భారత్ – ఆస్ట్రేలియా మధ్య నేడు నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే, స్టేడియంలోని కొన్ని చోట్ల విద్యుత్ కనెక్షన్ లేకపోవడం హాట్టాపిక్గా మారింది. దీనికి కారణం స్టేడియం నిర్వాహకులు గత 14 ఏళ్లుగా కరెంటు బిల్లు కట్టకపోవడమే. 2009 నుంచి బిల్లు కట్టకపోవడంతో.. ఏకంగా రూ.3.16 కోట్ల బకాయి పడింది. దీంతో ఐదేళ్ల కిందట ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ స్టేడియానికి కరెంటు సరఫరాను నిలిపేసింది. అయితే తర్వాత ఛత్తీస్గడ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు తాత్కాలిక కనెక్షన్ ఇచ్చారు.
అయితే అది కేవలం ప్రేక్షకుల గ్యాలరీలకు మాత్రమే అందుబాటులో ఉంది. రాత్రి పూట ఫ్లడ్ లైట్లు మొత్తం జనరేటర్ల మీద నడపాల్సి ఉంటుంది. దీంతో స్టేడియం తాత్కాలిక కనెక్షన్ సామర్థ్యాన్ని పెంచేందుకు క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ విద్యుత్ శాఖకు దరఖాస్తు చేసింది. ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన ఉన్న 200 కేవీ విద్యుత్ కనెక్షన్ను 1000 కేవీకి పెంచాలని కోరినట్లు రాయ్పూర్ రూరల్ సర్కిల్ ఇన్ఛార్జ్ అశోక్ ఖండేల్ వాల్ తెలిపారు.
కాగా, స్టేడియంలో కరెంటు లేదన్న విషయం 2018లో బయటకు వచ్చింది. అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న మారథాన్ అథ్లెట్లు ఈ విషయాన్ని గుర్తించారు. దీంతో ఈ అంశం కాస్తా తీవ్చ చర్చనీయాంశమైంది. అప్పుడే కోట్ల మేర కరెంటు బిల్లు పెండింగ్ లో ఉందన్న విషయం వెల్లడైంది. ఈ స్టేడియాన్ని నిర్మించిన తర్వాత నిర్వహణను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటోంది. మిగిలిన ఖర్చులు మాత్రం క్రీడా శాఖ భరించాల్సి ఉంది. అయితే, బిల్లు విషయంలో మాత్రం రెండు శాఖలూ పరస్పరం నిందించుకుంటున్నాయి. బకాయిలు క్లియర్ చేయాలని విద్యుత్ శాఖ పీడబ్ల్యూడీ, క్రీడా శాఖకు పలుమార్లు నోటీసులు పంపినా ఇంతవరకూ చెల్లింపు జరపకపోవడం గమనార్హం.
ఈ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వడంపై తాము సందేహిస్తున్నామని ఛత్తీస్గడ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఇప్పటి వరకూ ఇక్కడ మూడు అంతర్జాతీయ మ్యాచ్లు జరిగాయని.. ఆ సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాటుగా జనరేటర్లను వినియోగించినట్లు వివరించారు. మ్యాచ్లు జరిగే ప్రతీసారీ తమకు ఇదో పెద్ద సమస్య అవుతోందని వాపోతున్నారు.
Also Read..
Bomb Threat | బెంగళూరులో 15 పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసు శాఖ
Air India | విమానంలో క్యాబిన్ పైకప్పు నుంచి నీటి లీకేజీ.. స్పందించిన ఎయిర్ ఇండియా
Vladimir Putin | ఒక్కొక్కరు 8 మంది పిల్లల్ని కనండి.. అమ్మాయిలకు రష్యా అధ్యక్షుడి విజ్ఞప్తి