హైదరాబాద్ : హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో 7వ పికిల్ బాల్ నేషనల్ చాంపియన్షిప్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. పికిల్ బాల్ టోర్నమెంట్ ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగనుంది. 16 రాష్ట్రాలకు చెందిన 215 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. అన్ని రకాల క్రీడలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు.
పికిల్ బాల్ గేమ్ గురించి చాలా మందికి తెలియదు. కానీ ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా ఈ గేమ్ పాపులర్ అవుతుందన్నారు. ఈ ఆట ఆడటం వల్ల మంచి ఫిట్నెస్ వస్తుందన్నారు. చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే.. 60 సంవత్సరాల వయసున్న వృద్ధుల వరకు కూడా ఈ గేమ్ను ఎంజాయ్ చేయొచ్చు. రానున్న రోజుల్లో పికిల్ బాల్ క్రీడ మరింత ప్రజాదరణ పొందనుందని తెలిపారు. 16 రాష్ట్రాల నుంచి 215 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. టోర్నమెంట్కు కల్పించిన సదుపాయాలను చూసి ఇతర రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.