హన్వాడ, అక్టోబర్ 3: రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్దపీట వేస్తున్నదని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. యువకులు తమకిష్టమైన క్రీడల్లో రాణించి రాష్ర్టానికి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ స్పోర్ట్స్ కిట్ల పంపిణీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి మంత్రి శ్రీకారం చుట్టారు. ప్లేయర్లకు కిట్లను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 వేల గ్రామాల్లో కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల క్రీడా మైదానాలను పూర్తి చేశామన్నారు. ఉదయం, సాయంత్రం మైదానాల్లో క్రీడలు ఆడాలన్నారు. క్రీడాకారుల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నదన్నారు. అనంతరం సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ క్రీడలకు సర్కారు సముచిత స్థానం కల్పిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, క్రీడా శాఖ డైరెక్టర్ కే.లక్ష్మి, కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నరసింహ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు కేసీఆర్ స్పోర్ట్స్ కిట్ల పంపిణీ కొనసాగుతుందని సాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్ తెలిపారు. వనపర్తి జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, నిర్మల్ జిల్లాలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, హైదరాబాద్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు కిట్ల పంపిణీని ప్రారంభించారు. వందకోట్లకు పైగా బడ్జెట్ కేటాయించి కేసీఆర్ స్పోర్ట్స్ కిట్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారని ఆంజనేయ గౌడ్ పేర్కొన్నారు.
2 క్రికెట్ బ్యాట్లు
2 జతల బ్యాటింగ్ గ్లౌవ్స్
1 జత కీపింగ్ గ్లౌవ్స్ (లెదర్)
2 జతల బ్యాటింగ్ ప్యాడ్లు
2 జతల కీపింగ్ ప్యాడ్లు
6 స్టంప్స్
12 బంతులు
4 సింథటిక్ వాలీబాల్స్
1 వాలీబాల్ నెట్
1 సైకిల్ పంప్
3 జతల డంబుల్స్
1 డిస్కస్ త్రో
6 టెన్నికాయిట్ రింగ్స్
4 స్కిప్పింగ్ రోప్స్
1 స్టాప్ వాచ్
3 ప్లాస్టీక్ విజిల్స్
75 టీషర్ట్లు