మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 24: రానున్న రోజుల్లో ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, ప్రపంచ చాంపియన్షిప్ లాంటి మెగాటోర్నీల్లో అత్యధిక పతకాలు కొల్లగొట్టి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రూ.7.22 కోట్లతో నిర్మించిన సింథటిక్ ట్రాక్ను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత క్రీడాజ్యోతి వెలిగించి 8వ తెలంగాణ జూనియర్ అథ్లెటిక్స్ టోర్నీ పోటీలకు లాంఛనంగా పచ్చజెండా ఊపారు. 33 జిల్లాల నుంచి వచ్చిన దాదాపు 1100 మంది ప్లేయర్లు మార్చ్ఫాస్ట్ నిర్వహించగా మంత్రి గౌరవవందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మెదక్ స్టేడియాన్ని చూస్తుంటే గచ్చిబౌలి గుర్తుకు వస్తున్నది. గచ్చిబౌలి స్టేడియంలో పెద్ద సింథటిక్ ట్రాక్ తర్వాత మెదక్లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. దీనిపై మొదటిసారి జరుగుతున్న జూనియర్ అథ్లెటిక్స్ పోటిలను ప్లేయర్లు సద్వినియోగం చేసుకోవాలి. క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మెండైన ప్రోత్సాహం అందిస్తున్నది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు అండగా నిలుస్తున్నది’ అని అన్నారు. అనంతరం తొలి రోజు పోటీల్లో విజేతలకు మంత్రి హరీశ్రావు పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా క్రీడల అధికారి నాగరాజు, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గ్గొన్నారు.