క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు టోర్నీలు నిర్వహించాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్రీడా సంఘాలకు సూచించారు. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర క్రీడాకారులు పతకాలు సాధిస్తున్నారు. క్రీడల్లో చిన్నారులను ప్రోత్సహించేందుకు మాజీ క్రీడాకారులు ముందుకువస్తే ప్రభుత్వం సహకరించేందుకు సిద్ధంగా ఉంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ రీజనల్ ఈడీ సునీల్ కుమార్, భారత ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రమోద్, తెలంగాణ అర్చరీ అధ్యక్షుడు అనిల్, పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ లక్ష్మీకాంత్, ద్రోణాచార్య అవార్డీ సంజీవ సింగ్ తదితరులు పాల్గొన్నారు.