ఉపాధి హామీ పనులతో ఊతం
నీటికుంటలతో పెరుగనున్న భూగర్భజలాలు
నియోజకవర్గంలో అత్యధికంగా ఫాంపాండ్స్ ఏర్పాటు
భూగర్భజలాలు పెంచేందుకు ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 29 : వానకాలంలో వచ్చిన వరద నీరు వృథాగా పోకుండా ఫాంపాండ్స్ ఏర్పాటుచేసి, అందులో నిల్వ చేస్తే ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగేందుకు తోడ్పడుతాయి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు భూగర్భజలాలు అడుగంటడం సహజం. దీంతో బోర్లు, బావులు వట్టిపోతాయి. నీటి ఇబ్బందులు అధిగమించేందుకు ప్రభుత్వం రైతుల పొలాల్లో ఫాంపాండ్స్ నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. ప్రతి గ్రామంలో కనీసం ఐదు నుంచి ఇరవై ఫాంపాండ్స్ నిర్మించాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలతో పొలాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో ఉపాధి హామీ అధికారులు రైతుల్లో చైతన్యం పెంచి ఫాంపాండ్స్ నిర్మించుకునేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు.
రైతుల ప్రయోజనమే లక్ష్యంగా..
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనుల కింద రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ప్రతి గ్రామంలో 5 నుంచి 20 వరకు ఫాంపాండ్స్, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయించారు. ఇందుకు ఉన్నతస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని నాగన్పల్లి, పోల్కంపల్లి, దండుమైలారం, నెర్రపల్లి, రాయపోల్, యాచారం మండలంలోని చౌదర్పల్లి, గడ్డమల్లాయగూడ, గున్గల్, మంచాల మండలంలోని మంచాల, జాపాల, ఆరుట్ల, లోయపల్లి గ్రామాల్లో ఫాం పాండ్స్ ఏర్పాటు చేయించారు. ప్రతి గ్రామానికి 15 నీటిగుంతలు ఏర్పాటు చేయిస్తే భూగర్భ జలా లు పెంపొందేందుకు తోడ్పడుతాయని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో రైతులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి నీటి గుంతలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఫాంపాండ్స్ నిర్మాణం..
ఫాంపాండ్స్ను అధికారులు శాస్త్రీయంగా సర్వేలు చేసి నిర్మిస్తారు. నీటికుంటల కోసం ఎంపిక చేసిన రైతు పొలా న్ని మొదటగా పరిశీలించి, సారవంతమైన ప్రాంతం ఎక్కడ ఉందో గుర్తిస్తారు. ఆ ప్రాంతాన్ని దీర్ఘచతురస్రాకారంలో తవ్వుకుంటూ వెళ్తారు. వీటిలో రెండు రకాలు చిన్నసైజ్, పెద్దసైజ్ ఫాంపాండ్స్గా నిర్మాణాలు చేపడుతారు. చిన్నసైజ్ కోసం 9మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతు ఉండేలా నీటి కుంటను నిర్మిస్తారు. దీనికోసం 55 పనిదినాలను నిర్ణయించి 5 నుంచి ఆరుగురు కూలీలు 11 రోజుల పాటు పనిచేసి చిన్ననీటి కుంటలను నిర్మిస్తారు. ఇందుకోసం ఉపాధి హామీ పథకం ద్వారా రూ.15 వేలు కూలీలకు ప్రభుత్వం చెల్లిస్తుంది. పెద్ద నీటికుంటను 8మీటర్ల పొడవు, 6మీటర్ల వెడల్పు, 3మీటర్ల లోతుతో నిర్మిస్తారు. ఇందుకోసం 55 పనిదినాలను నిర్ణయించి 10 మంది కూలీలు 11 రోజుల పాటు పనిచేసి నిర్మిస్తారు. దీనికోసం ప్రభుత్వం రూ.27వేలను కూలీగా చెల్లిస్తుంది.
ఉపయోగాలు…
ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం రైతులకు వరంలా మారింది. వర్షం పడని ప్రాంతాల్లో భూగర్భజలాలను కాపాడుకునేందుకు ఫాంపాండ్స్ను నిర్మించుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది. నీటి కుంటలను పొలంలో నిర్మించుకోవడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరుగడంతో పరిసరాల్లో ఉన్న బోర్లు, బావుల్లో నీరు అందుబాటులోకి వస్తుంది. వీటితో పాటు రైతు తన పొలంలోనే చేపలు పెంచడం, పశువులకు నీరు తాగించడం, అత్యవసర పరిస్థితుల్లో కాలువ ద్వారా తోటలకు నీటిని మళ్లించడం వంటి లాభాలు ఎన్నో ఉన్నాయి.
నీటికుంటలు తవ్వించేందుకు కృషిచేస్తున్నాం
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నీటికుంటలు ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించి, ప్రతి గ్రామంలో ఐదు నుంచి పదిహేను నీటికుంటలు ఏర్పాటు చేయించాం. అన్ని గ్రామాలకు మరిన్ని నీటికుంటలు మంజూరు చేయించి, భూగర్భజలాల పెంపుకోసం తోడ్పడుతాం. నీటికుంటల నిర్మాణం వల్ల భూగర్భజలాలు పెరుగుతాయి.
ఇవి కూడా చదవండి
బాతుపిల్లకు సింహం సాయం.. వైరల్ వీడియో
కోహ్లీ వరల్డ్ రికార్డు..పాంటింగ్, సచిన్లను వెనక్కి నెట్టి!