IPL 2024 Mini Auction : ఇండియన్ ప్రీమియర్ 17వ సీజన్ మినీ వేలం దుబాయ్(Dubai) వేదికగా జరుగుతోంది . 10 ఫ్రాంచైజీలతో పాటు కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఈ వేలం పాటను తొలిసారి ఒక మహిళ నిర్వహించనుంది. ఆమె ఎవరో కాదు.. ఫేమస్ ఆక్షనీర్ మల్లికా సాగర్ (Mallika Sagar). ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకూ మగవాళ్లు మాత్రమే ఆక్షనీర్గా ఉన్నారు.
మొదట్లో రిచర్డ్ మడ్లే, హుగ్ ఎడ్మెడెస్(బ్రిటన్), చారు శర్మ(భారత్) తర్వాత ఈ లీగ్ వేలాన్ని నిర్వహిస్తున్న నాలుగో ఆక్షనీర్గా, తొలి మహిళగా మల్లికా రికార్డుల్లోకి ఎక్కింది. ఐపీఎల్ బీసీసీఐ తొలిసారి నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్ వేలంతో మల్లికా పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఆక్షన్ సమయంలో ఏమాత్రం తడబడకుండా స్పష్టంగా మాట్లాడడం ఆమె ప్రత్యేకత. అంతేకాదు ఎంతో నేర్పుగా, ఓర్పుగా ఉండడం 48 ఏండ్ల మల్లిక విజయ రహస్యం.
ఆక్షనీర్ మల్లికా సాగర్
ముంబైలోని వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన మల్లికకు ఆర్ట్ కలెక్షన్ అంటే ఇష్టం. దాంతో, అమెరికాలో హిస్టరీ ఆఫ్ ఆర్ట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అనంతరం.. స్వదేశం తిరిగొచ్చిన మల్లిక ముంబైలోని ఒక ప్రైవేట్ ఆక్షన్ సంస్థలో ఆధునిక భారత దేశానికి సంబంధించిన కళాకండాలను వేలం వేసింది. 2011లో మల్లిక ఇంటర్నేషనల్ ఆర్ట్, లగ్జరీ బిజినెస్ క్రిస్టీలో ఆక్షనీర్గా వ్యవహరించింది.
దాంతో, భారత క్రీడా రంగంలో ఏకైక మహిళా ఆక్షనీర్గా పేరొందిన ఆమె నాలుగు సార్లు ఐపీఎల్ ఆక్షనీర్గా ఉన్న ఎడ్మెడెస్ దృష్టిలో పడింది. దాంతో, ఆయన బీసీసీఐకి మల్లిక పేరు సూచించారు. అలా మల్లిక మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ చాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత ప్రో కబడ్డీ 10వ సీజన్ వేలానికి కూడా మల్లికనే ఆక్షనీర్గా పిలిచారు. ఈమధ్యే ముగిసిన డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ వేలంలోనూ మల్లిక తన మార్క్ చూపించింది.