Commonwealth Games : ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్ 2026 నిర్వహణ, ఆతిథ్య హక్కులపై అయోమయం నెలకొంది. మెగా టోర్నీ ఆతిథ్యమిచ్చేందుకు ఏ ఒక్క దేశం కూడా ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటికే మా వల్ల కాదంటూ ఆస్ట్రేలియా, బ్రిటన్లు చేతులెత్తేయగా.. తాజాగా మలేషియా(Malaysia) సైతం తాము టోర్నీని నిర్వహించలేమని కుండబద్ధలు కొట్టింది. తగినంత సమయం లేకపోవడంతో పాటు నిధుల కొరత కారణంగానే తాము టోర్నీ ఆతిథ్య రేసు నుంచి బయటకొచ్చేశామని మలేషియా ప్రభుత్వం వెల్లడించింది.
అయితే.. ఈ గేమ్స్ నిర్వహణ కోసం కామన్వెల్త్ క్రీడల సమాఖ్య రూ. 1,00 మిలియన్ పౌండ్ల(భారతీయ కరెన్సీలో రూ. 1,000 కోట్లు)ను ఇస్తామని చెప్పినా సరే మలేషియా వెనుకంజ వేయడం గమనార్హం. ‘మా వద్ద సరిపోను సమయం లేదు. ఇంత తక్కువ టైమ్లో టోర్నీని నిర్వహించలేం. టోర్ని సన్నద్ధతకు పట్టే సమయం. అయ్యే ఖర్చును అంచనా వేయగా ఇదంతా సాధ్యం కాదని అనిపించింది’ అని మలేషియా సమాచార శాఖ మంత్రి ఫహ్మీ ఫద్జిల్ తెలిపాడు.
Keputusan telah dibuat oleh Jemaah Menteri hari ini. Malaysia tidak setuju terima tawaran tuan rumah Sukan Komanwel 2026. pic.twitter.com/LiyhXooc9J
— Hannah Yeoh (@hannahyeoh) March 22, 2024
ఒకవేళ కామన్వెల్త్ పోటీలకు ఏ దేశం ఆతిథ్యమిచ్చేందుకు ముందుకు రాకుంటే టోర్నీ జరగడం అసాధ్యమే. అదే జరిగితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి కామన్వెల్త్ క్రీడలు నిర్వహించకపోవడం ఇదే మొదటిసారి కానుంది.