Onion Export Ban | సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం విదేశాలకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. ఉల్లి ధరలను కట్టడి చేయడానికి గతేడాది డిసెంబర్ నుంచి 2024 మార్చి నెలాఖరు వరకూ ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో సదరు ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని తదుపరి నోటీసు జారీ చేసే వరకూ పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో ఉల్లిధరలను అదుపు చేయడానికి కేంద్రం పలు చర్యలు తీసుకున్నది. 2023 అక్టోబర్ ఎనిమిదో తేదీ నుంచి డిసెంబర్ 31 వరకూ ఉల్లి ఎగుమతులపై టన్నుకు కనీస ఎగుమతి ధర 800 డాలర్లుగా ఖరారు చేసింది. డిసెంబర్ ఎనిమిదో తేదీ నుంచి 2024 మార్చి నెలాఖరు వరకూ ఎగుమతులపై నిషేధం విధించింది.
ఉల్లి ఎగుమతులపై నిషేధం అమల్లోకి రావడంతో మార్కెట్లో ఉల్లి ధరలు సగానికి దిగి వచ్చాయి. అత్యధికంగా ఉల్లి పండే మహరాష్ట్రలోని కొన్ని హోల్ సేల్ మార్కెట్లలో క్వింటాల్ ఉల్లిగడ్డల ధర గతేడాది డిసెంబర్ లో రూ.4,500 పలికితే, ఇప్పుడు రూ.1200లకు పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు.బంగ్లాదేశ్ తోపాటు మలేషియా, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తదితర దేశాలు ఉల్లిగడ్డల కోసం భారత్ పైనే ఆధార పడి ఉన్నాయి. ఆసియా దేశాలు దిగుమతి చేసుకునే ఉల్లిలో సగం వాటా భారత్దే.