గత మ్యాచ్తో పోల్చుకుంటే మెరుగైన ప్రదర్శన చేసినా.. ఐపీఎల్ 15వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టలేకపోయింది. మొదట క్రమశిక్షణాయుత బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేసిన రైజర్స్.. ఆ తర్వాత కష్ట సాధ్యంకాని ఛేదనలో ఒత్తిడికి గురై పరాజయం వైపు నిలిచింది.విజయానికి మూడు ఓవర్లలో 33 పరుగులు చేయాల్సిన దశలో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ అవేశ్ ఖాన్ మ్యాచ్ను మలుపుతిప్పాడు. వరుస బంతుల్లో హార్డ్ హిట్టర్లు నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్ను పెవిలియన్ చేర్చి రైజర్స్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు!
ముంబై: చివరి ఓవర్ వరకు ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో ఒత్తిడికి గురైన సన్రైజర్స్ హైదరాబాద్ పరాజయం పాలైంది. ఐపీఎల్ 15వ సీజన్ తొలి పోరులో రాజస్థాన్ చేతిలో ఓడిన హైదరాబాద్.. వరుసగా రెండో మ్యాచ్లోనూ గెలుపు రుచి చూడలేకపోయింది. సోమవారం జరిగిన పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ 12 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
కెప్టెన్ కేఎల్ రాహుల్ (50 బంతుల్లో 68; 6 ఫోర్లు, ఒక సిక్సర్), దీపక్ హుడా (33 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించారు. క్వింటన్ డికాక్ (1), ఎవిన్ లూయీస్ (1), మనీశ్ పాండే (11) వెంటవెంటనే ఔట్ కావడంతో ఒక దశలో 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును రాహుల్, హుడా ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 87 పరుగులు జోడించారు. ఆఖర్లో ఆయుశ్ బదోనీ (19 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడాడు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, వాషింగ్టన్ సుందర్, షెఫర్డ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 157 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్లు కేన్ విలియమ్సన్ (16), అభిషేక్ శర్మ (13) ఎక్కువసేపు నిలువలేకపోగా.. రాహుల్ త్రిపాఠి (30 బంతుల్లో 44; 5 ఫోర్లు, ఒక సిక్సర్), నికోలస్ పూరన్ (24 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కాస్త పోరాడారు. చివరి రెండు ఓవర్లలో 26 పరుగులు చేయాల్సిన దశలో వాషింగ్టన్ సుందర్ (18), షెఫర్డ్ (8) ధాటిగా ఆడలేకపోయారు. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్ 4, జాసెన్ హోల్డర్ మూడు వికెట్లు పడగొట్టారు. అవేశ్ ఖాన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఐపీఎల్ 15వ సీజన్లో భాగంగా మంగళవారం రాజస్థాన్తో బెంగళూరు తలపడనుంది.
సంక్షిప్త స్కోర్లు
లక్నో: 20 ఓవర్లలో 169/7 (కేఎల్ రాహుల్ 68, దీపక్ హుడా 51; నటరాజన్ 2/26, సుందర్ 2/28), హైదరాబాద్: 20 ఓవర్లలో 157/9 (రాహుల్ త్రిపాఠి 44, పూరన్ 34; అవేశ్ ఖాన్ 4/24, హోల్డర్ 3/34).