IPL | ‘పొగడ్త నలుగురి మధ్యలో చెబితే.. విమర్శ నాలుగు గోడల మధ్య చెప్పాలి’ అని అంటారు పెద్దలు. కానీ ఐపీఎల్లో రెండేండ్ల క్రితం ‘లక్నో సూపర్ జెయింట్స్’ ఫ్రాంచైజీని కొన్న ప్రముఖ వ్యాపార దిగ్గజం సంజీవ్ గొయెంకా మాత్రం లక్నో సారథి కేఎల్ రాహుల్పై బహిరంగంగానే చిందులు తొక్కాడు. అలాగని రాహుల్ చేయకూడని తప్పేమీ చేయలేదు. బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ఓడిపోయినందుకు గాను గొయెంకాకు చిర్రెత్తుకొచ్చి కోపం నశాలానికి తాకింది. తాను మాట్లాడుతున్నది అంతర్జాతీయ స్థాయిలో భారత క్రికెట్కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టార్ క్రికెటర్ అన్న సంగతి కూడా మరిచిపోయి.. ఏదో గల్లీ క్రికెట్ మ్యాచ్లో బెట్ ఓడిపోతే ఆటగాళ్లను తిట్టినట్టు రాహుల్ ముఖం మీదే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘అసలు ఇలాగేనా ఆడటం’ అన్నట్టుగా కస్సుబుస్సుమన్నాడు. మైదానంలో వందలాది కెమెరాలు, వేలాది మంది జనం ఉన్నారనే విషయం మరిచి తమ జట్టును రెండు సార్లు ప్లేఆఫ్స్ చేర్చి, నిర్జీవమైన లక్నో పిచ్పై అనుభవరాహిత్యమున్న బౌలర్లతోనే అద్భుతాలు చేసిన కెప్టెన్ను అందరిముందూ దోషిలా నిలదీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక ఆటగాళ్లతో ఫ్రాంచైజీ ఓనర్ల వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశమైంది.
ఐపీఎల్లో ఓనర్లు ఆటగాళ్లతో ఇలా దురుసుగా ప్రవర్తించడం ఇదే కొత్తకాదు. 2016లో చెన్నైపై నిషేధం ఉన్నప్పుడు రైజింగ్ పూణె సూపర్జెయింట్స్ను కొనుగోలు చేసిన గొయెంక.. ఆ జట్టుకు సారథిగా వ్యవహరించిన దిగ్గజ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపైనా ఇదే తీరుగా వ్యవహరించాడని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. ఆ సీజన్ తర్వాత ధోనీని కెప్టెన్గా తప్పించి స్టీవ్ స్మిత్ను నాయకుడిగా నియమించడం వివాదాస్పదమైంది. ఈ సందర్భంగా సంజీవ్ సోదరుడు హర్ష్ గొయెంక ధోనీని కించపరుస్తూ చేసిన ట్వీట్పై అప్పట్లో భారత క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. గొయెంక బ్రదర్స్తో పాటు ఆటగాళ్లతో సన్రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ వ్యవహార శైలి కూడా చర్చనీయాంశమే. తమ జట్టుకు తొలి ట్రోఫీ అందించిన డేవిడ్ వార్నర్ను 2021 మిడ్ సీజన్లో అన్యాయంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం, కేన్ విలియమ్సన్, ఎయిడెన్ మార్క్మ్న్రూ ఇలాగే వాడుకుని వదిలేయడం విమర్శలకు తావిచ్చింది. 2022 సీజన్లో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. సీఎస్కే యజమానుల ఒత్తిడి తట్టుకోక ‘నా వల్ల కాదు మహాప్రభో’ అని సీజన్ మధ్యలోనే ధోనీ ఇచ్చిన కెప్టెన్సీ కాడి వదిలేశాడు. ముంబైకి ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మపై అంబానీల తీరూ విమర్శలమయమే అయింది. ఇటీవల సంజూ శాంసన్ ఔట్పై థర్డ్ అంపైర్ టీవీ రిైప్లెలు చూస్తుండగానే స్టేడియం లాబీలో మ్యాచ్ చూస్తున్న క్యాపిటల్స్ యజమాని పార్థ్ జిందాల్.. ‘నువ్వు ఔట్.. ఔట్..’ అంటూ అరవడమూ వివాదాస్పదమైంది.
ఐపీఎల్లో ప్రస్తుతమున్న పది జట్ల యజమానులు కోటాను కోట్ల వ్యాపార సామ్రాజ్యాలకు అధిపతులే. ‘యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం, ప్రేక్షకులకు క్రికెట్ వినోదాన్ని అందించడం’ అనే ఐపీఎల్ ప్రాథమిక సూత్రాలను పక్కనబెడితే ఓనర్లు ఈ ఆటను పూర్తి వ్యాపార దృష్టితోనే చూస్తున్నారనేది జగమెరిగిన సత్యం. బీసీసీఐ కూడా ‘డబ్బు ప్రధానం’గానే ఈ టోర్నీని నిర్వహిస్తుందనేది ఎప్పట్నుంచో ఉన్న విమర్శ. దీంతో ఫ్రాంచైజీ ఓనర్లకు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది పరిస్థితి. లీగ్ను శాసించే స్థాయికి చేరిన ఈ సామ్రాజ్యాధిపతులు.. ఆటగాళ్లు విఫలమైతే వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలకు దిగుతున్నారు. వ్యాపారాల్లో పోటీతో పాటు ఐపీఎల్లో ట్రోఫీ గెలవడమన్నది ఫ్రాంచైజీల ‘పెట్టుబడి’దారులకు ఓ ప్రతిష్టగా మారింది. ఆటలో గెలుపోటములు సహజమన్న విషయాన్ని గాలికొదిలి ‘గెలవకుంటే గెంటివేతే’ అన్నట్టుగా వ్యవహరిస్తూ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు తమ బానిసలుగా చేసుకుంటున్నాయని అభిమానులు వాపోతున్నారు.