వేముల ప్రశాంత్రెడ్డి కూడా..
ఖమ్మం నూతన బస్టాండ్, సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం ప్రారంభం
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
ఖమ్మం, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్తోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. ఏప్రిల్ 2న ఉదయం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిలతో కలిసి హెలికాఫ్టర్లో బయలుదేరుతారు. ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియానికి చేరుకుంటారు. ఖమ్మంలో నిర్మించనున్న రెండో దశ ఐటీ హబ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే నగరంలోని శ్రీశ్రీ విగ్రహం నుంచి వీ వెంకటాయపాలెం వరకు నిర్మించనున్న నాలుగు లైన్ల రహదారి పనులకు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేస్తారు. అనంతరం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంజూరైన రూ.30 కోట్ల ప్రత్యేక నిధులతో నిర్మించే సీసీ, బీటీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేస్తారు.
ఖమ్మం అర్బన్ మండలం టేకులపల్లిలో నిర్మించిన 1004 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభిస్తారు. అనంతరం నగరపాలక సంస్థ పరిధిలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోజూ మంచినీరు అందజేసే మంచినీటి సరఫరా పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆధునిక హంగులతో బైపాస్రోడ్డులో నిర్మించిన నూతన ఆర్టీసీ బస్టాండ్ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కాల్వొడ్డులోని మున్నేరు బ్రిడ్జి వద్ద ఆధునీకరించిన వైకుంఠధామాన్ని కూడా మంత్రులు కేటీఆర్, ప్రశాంత్రెడ్డి, అజయ్కుమార్ ప్రారంభిస్తారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం నేరుగా సర్దార్ పటేల్ స్టేడియానికి వచ్చి హెలికాఫ్టర్ ద్వారా సత్తుపల్లికి చేరుకుంటారు. సత్తుపల్లిలో నూతనంగా నిర్మించిన పురపాలక సంఘ కార్యాలయ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సత్తుపల్లిలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం సత్తుపల్లి నుంచి నేరుగా హెలికాఫ్టర్ ద్వారా హైదరాబాద్ తిరుగు పయనమవుతారు. మంత్రి కేటీఆర్ పర్యటన ఖరారు కావడంతో జిల్లా అధికారులు వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి తుదిమెరుగులు దిద్దుతున్నారు. పోలీసు అధికారులు ఖమ్మం, సత్తుపల్లిల్లో బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నారు.