Manipur | ఇంఫాల్, మే 3: మణిపూర్లో మైతీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణతో చెలరేగిన హింసాకాండకు శుక్రవారంతో ఏడాది గడిచింది. గత ఏడాది మే 3న ప్రారంభమైన ఈ హింసతో రాష్ట్రప్రజలు రెండుగా చీలిపోయారు. ఏడాది గడిచినా, మణిపూర్లో పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. నేటికీ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకొంటున్నాయి. హింసాకాండలో ఇప్పటికి 200 మందికి పైగా మరణించగా, 1,500 మందికి పైగా గాయపడ్డారు. వేలాది ఇండ్లు ధ్వంసం కావడంతో 60 వేల మందికి పైగా ప్రజలు శరణార్థి శిబిరాల్లో, ఇతర ప్రాంతాల్లో తలదాచుకొంటున్నారు. 28 మంది ఆచూకీ లేకుండా పోయారు. రాష్ట్రంలో హింసను నియంత్రించడంలో, శాంతి పరిస్థితులను నెలకొల్పడంలో కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయనే విమర్శలు ఉన్నాయి.
మైతీలకు ఎస్టీ హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పర్వత ప్రాంత జిల్లాల్లో 2023, మే 3న కుకీలు చేపట్టిన ‘ట్రైబల్ సంఘీభావ ర్యాలీ’ హింసకు దారితీసిన విషయం తెలిసిందే. లోయ జిల్లాల్లో మైతీలు, పర్వత ప్రాంతాల్లో కుకీలు అధికంగా ఉంటారు. అయితే ఏడాది క్రితం వరకు ఈ కమ్యూనిటీల మధ్య స్పష్టమైన శత్రుత్వం, విభజన లేదు. అలాంటిది ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా భద్రతా బలగాల పహారా, చెక్ పాయింట్లు, బారికేడ్లు వంటివి దర్శనమిస్తున్నాయి. రెండు జిల్లాల సరిహద్దును దాటాలంటే దేశ సరిహద్దునే దాటే విధంగా తనిఖీలు ఉంటున్నాయి.
బిష్ణుపూర్, కుకీలు అధికంగా ఉండే చురాచంద్పూర్ జిల్లాలు, అదేవిధంగా మైతీలు అధికంగా ఉండే ఇంఫాల్ వెస్టు, కుకీల ఏరియా అయిన కాంగ్పోక్సి జిల్లాల మధ్య సరిహద్దుల్లో చెక్ పాయింట్లు ఉన్నాయి. చాలా మంది ‘విలేజ్ వలంటీర్లు’గా సాయుధులుగా మారి, తమ గ్రామాలకు రక్షణగా ఉంటున్నారు. మైతీలు, కుకీ మధ్య రేగిన ఘర్షణ పౌర సమాజాన్నే కాదు.. పొలీసులు, ప్రభుత్వ అధికారులను కూడా రెండుగా విభజించింది. గత ఏడాది నుంచి కొనసాగుతున్న ఘర్షణల్లో 16 మంది కేంద్ర భద్రతా సిబ్బంది, రాష్ట్ర పోలీసులు విధి నిర్వహణలో మరణించారు.
మరణించిన వారి సంఖ్య 226 (మహిళలు-20, చిన్నారులు-8)
1,500 గాయపడిన వారి సంఖ్య
16,000 ఇతర ప్రాంతాకు వెళ్లిపోయినవారు
13,247 ధ్వంసమైన ఇండ్లు, ఇతర నిర్మాణాలు
26 ఆచూకీ లేని వారి సంఖ్య