కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించి దేశం గర్వించేలా చేశారు వారు . కానీ అక్కడి వరకూ రావడానికి వారు ఎన్నో అవమానాలు ఎదుర్కోన్నారు. బర్మింగ్హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మహిళల ఫోర్స్ లాన్ బౌల్స్ విభాగంలో భారత జట్టు పసిడి నెగ్గింది. ఈ అద్భుతమైన ఫీట్ సాధించిన భారత మహిళలు లవ్లీ చౌబే, రూపా రాణి టిర్కీ, పింకీ, నయనమోని సైకియా తాజాగా ఒక ఆన్లైన్ ఇంటర్వ్యూలో పాల్గొని వారి అనుభవాలను పంచుకున్నారు.
కామన్వెల్త్ క్రీడలకు వెళ్లే ముందు తాము ఎదుర్కొన్న అవమానాలను గుర్తుచేసుకుని కన్నీరుపెట్టుకున్నారు. బర్మింగ్హామ్ వెళ్లే సమయానికి తాము చాలా డిప్రెషన్లో ఉన్నామని, తమ గురించి చాలా మంది రకరకాల కామెంట్లు చేశారని రూపా రాణి చెప్పింది. ఆ సమయంలో తాము చాలా ఒత్తిడికి గురయ్యామని, మెడల్ లేకుండా స్వదేశం తిరిగొస్తే మళ్లీ లాన్ బౌల్స్లో తమకు భవిష్యత్తు ఉండేది కాదేమోనని కన్నీళ్లు పెట్టుకుంది.
లవ్లీ చౌబే మాట్లాడుతూ.. ‘కేవలం అందం చూసే మాకు అవకాశం ఇచ్చారని కూడా కొందరు అన్నారు. మాలో ఎలాంటి టాలెంట్ లేకుండానే మెడల్ గెలిచామా? లేకపోతే అందం చూసి మెడల్ ఇచ్చేశారా?‘ అని ఆమె అడిగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవడంతో నెటిజన్లు ఈ క్రీడాకారిణులకు మద్దతు తెలుపుతున్నారు. వారిపై అనవసర వ్యాఖ్యలు చేసిన వారిని తిట్టిపోస్తున్నారు.