భారత షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఇద్దరూ కొరియా ఓపెన్ సూపర్ 500 ఛాంపియన్షిప్ సెమీస్కు దూసుకెళ్లారు. పాల్మా స్టేడియంలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సింధు, పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో శ్రీకాంత్ జయభేరి మోగించారు. టోర్నీలో మూడో సీడ్ అయిన సింధు.. ఏడో సీడ్ అయినా బుసానన్ ఓంగ్బామ్రుంగ్ఫాన్ను ఓడించింది.
థాయ్ల్యాండ్కు చెందిన బుసానన్పై వరుస సెట్లలో విజయం సాధించిన సింధు సెమీస్లో అడుగు పెట్టింది. తొలి సెట్ ఆరంభంలో 2-5తో వెనుకబడిన సింధు ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించి ఆ సెట్ను 21-10తో ముగించింది. రెండో సెట్ ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన సింధు.. 21-16 తేడాతో ఆ సెట్ కూడా గెలిచింది.
43 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధు పూర్తి ఆధిపత్యం చెలాయించి విజయ కేతనం ఎగరేసింది. అదే సమయంలో ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్లో ఐదో సీడ్ అయిన కిదాంబి శ్రీకాంత్ కూడా 21-12, 18-21, 21-12 తేడాతో సన్ వాన్హోపై విజయం సాధించాడు. దీంతో వీళ్లిద్దరూ తమ తమ విభాగాల్లో సెమీస్లో అడుగుపెట్టారు.