అనుమానం నిజమైంది! వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్తో తొలి రెండు మ్యాచ్లకు అందుబాటులో లేని మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మొత్తం సిరీస్కు దూరమయ్యాడు. గాయాల బారిన పడ్డ కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి రాగా.. మిడిలార్డర్లో ఆకట్టుకోలేకపోతున్న శ్రేయస్ అయ్యర్పై సెలెక్షన్ కమిటీ వేటు వేసింది. వైజాగ్ టెస్టుకు రెస్టు తీసుకున్న హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ తిరిగి జట్టుకు ఎంపిక కాగా.. బీహార్ పేసర్ ఆకాశ్కు తొలిసారి టీమ్ఇండియా నుంచి పిలుపు వచ్చింది.
Team India | న్యూఢిల్లీ: పరుగుల రారాజు విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్తో సిరీస్కు అందుబాటులో లేకుండా పోయాడు. వ్యక్తిగత కారణాల వల్ల తొలుత రెండు మ్యాచ్లకు దూరమైన కోహ్లీ.. ఇప్పుడు మొత్తం సిరీస్ నుంచే తప్పుకున్నాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలువగా.. మిగిలిన మూడు మ్యాచ్ల కోసం బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ శనివారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. కెరీర్ ఆరంభం నుంచే సుదీర్ఘ ఫార్మాట్కు అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన కోహ్లీ లేకపోవడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే! ‘వ్యక్తిగత కారణాలతో మిగిలిన సిరీస్కు విరాట్ అందుబాటులో ఉండటం లేదని వెల్లడించాడు. అందుకే అతడిని సెలెక్షన్ పరిగణనలోకి తీసుకోలేదు. కోహ్లీ నిర్ణయాన్ని బోర్డు గౌరవిస్తున్నది’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. హైదరాబాద్లో జరిగిన తొలి మ్యాచ్లో టీమ్ఇండియా పరాజయం పాలవగా.. వైజాగ్ మ్యాచ్లో నెగ్గి రోహిత్ సేన సిరీస్ సమం చేసింది. ఇక ఇరు జట్ల మధ్య ఈ నెల 15 నుంచి రాజ్కోట్ వేదికగా మూడో మ్యాచ్ మొదలు కానుంది. గాయాల కారణంగా గత మ్యాచ్కు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తిరిగి జట్టులో చేరారు. రాహుల్ పూర్తిగా కోలుకోగా.. జడేజా మ్యాచ్ ఆరంభం వరకు ఫిట్నెస్ సాధించే అవకాశాలున్నాయి. వీరిద్దరి రాకతో.. వైజాగ్ టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన రజత్ పాటిదార్ బెంచ్కే పరిమితం కావాల్సి రావచ్చు. ఇక వెన్ను నొప్పితో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్పై సెలెక్షన్ కమిటీ వేటు వేసింది. కోహ్లీ, పుజారా, రహానే, రాహుల్ వంటి సీనియర్ల గైర్హాజరీలో.. మిడిలార్డర్లో బాధ్యత తీసుకోవాల్సిన శ్రేయస్ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో అతడిని జట్టుకు ఎంపిక చేయలేదు. ఇక చాన్నాళ్ల నిరీక్షణ తర్వాత భారత జట్టుకు ఎంపికై మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ చోటు నిలుపుకున్నాడు. పేస్ ఆల్రౌండర్ ఆకాశ్దీప్కు తొలిసారి అవకాశం వచ్చింది. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన మ్యాచ్ల్లో రాణించిన ఆకాశ్దీప్ ప్రతిభను సెలెక్టర్లు గుర్తించారు. విశ్రాంతి అనంతరం సిరాజ్ తిరిగి జట్టులో చేరగా.. అవేశ్ ఖాన్, సౌరభ్కుమార్ను రంజీలు ఆడేందుకు అనుమతిచ్చారు.
చదువు సంధ్యలు మానేసి.. క్రికెట్, క్రికెట్ అని తిరుగుతున్న ఆ కుర్రాడితో సహవాసం చేస్తే.. తమ పిల్లలు చెడిపోతారని వారించిన చుట్టుపక్కల వాళ్ల తల్లిదండ్రులే ఈ రోజు.. అతడికి అభినందనలు తెలిపేందుకు ఇంటిముందు లైన్ కట్టారు. కనీసం కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైనా.. ఇళ్లు గడుస్తుందని మొర పెట్టుకున్న ఆ తల్లి సంతోషానికి ఇప్పుడు అవధులు లేవు. ఇదంతా భారత టెస్టు జట్టుకు ఎంపికైన అకాశ్దీప్ గురించే! బీహార్లోని సస్రామ్కు చెందిన కుడి చేతివాటం మీడియం పేసర్కు తొలిసారి బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నుంచి పిలుపువచ్చింది. చిన్నప్పటి నుంచి క్రికెటే శ్వాసగా ధ్యాసగా పెరిగిన 27 ఏండ్ల ఆకాశ్.. రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఈ విషయం అతడి చెవిన పడింది. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆరు నెలల వ్యవధిలో అటు తండ్రిని, ఇటు సోదరుడిని కోల్పోయి పుట్టెటు కష్టాలు ఎదుర్కొన్న ఆకాశ్.. భారత జట్టు తరఫున రాణించడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని అంటున్నాడు. ‘త్వరలోనే భారత జట్టుకు ఎంపికవుతానని చాన్నాళ్లుగా అనుకుంటున్నా. ఆ అద్భుత క్షణం రానేవచ్చింది. ఆరు నెలల వ్యవధిలో తండ్రి, అన్నయ్యను కోల్పోయా. ఈ వార్త వాళ్లు విని ఉంటే చాలా సంతోషించేవారు’ అని అన్నాడు.
రోహిత్ (కెప్టెన్), యశస్వి, గిల్, రాహుల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్, భరత్, అశ్విన్, జడేజా, అక్షర్, సుందర్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్, ముఖేశ్, ఆకాశ్దీప్.