భారత్-సౌతాఫ్రికా సిరీస్ తర్వాత విడుదలైన ఐసీసీ వన్డే ర్యాకింగ్స్లో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ స్థానాలు పదిలంగా కాపాడుకున్నారు. తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్లో సౌతాఫ్రికా ఆటగాళ్లు మెరుగైన స్థానాల్లో నిలిచారు.
ఈ టోర్నీలో సఫారీల విజయంలో కీలక పాత్ర పోషించిన వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డీకాక్ తన కెరీర్లోనే బెస్ట్గా టాప్ 5లో చోటు సంపాదించాడు. మరో బ్యాటర్ రాసీ వాన్ డర్ డస్సెన్ కూడా మెరుగైన ర్యాంక్ సాధించాడు. కెరీర్లోనే తొలిసారి పదో స్థానంలో నిలిచాడు.
ఈ సిరీస్లో రాణించిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఒక స్థానం మెరుగై 15వ స్థానంలో నిలిచాడు. స్టార్ బ్యాటర్, మాజీ సారధి విరాట్ కోహ్లీ తన రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. ఈ సిరీస్లో కోహ్లీ రెండు అర్ధశతకాలతో రాణించిన సంగతి తెలిసిందే.
గాయం కారణంగా ఈ సిరీస్కు దూరమైన మరో స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ తన మూడో స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కొనసాగుతున్నాడు.