టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహులు మరోసారి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. అయితే ఇది భారీ స్కోరు చేసి కాదు. ఒక 11 ఏళ్ల క్రికెటర్ ప్రాణాలు కాపాడి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరద్ అనే ఒక 11 ఏళ్ల పిల్లవాడు అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. పిల్లాడిని కాపాడాలంటే ఎముకల మజ్జ (బోన్ మ్యారో) ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గమని వైద్యులు చెప్పారు. ఈ శస్త్రచికిత్స చేయించాలంటే రూ.35 లక్షలు అవుతుంది.
కానీ వరద్ తల్లిదండ్రులు సంపన్నులు కాదు. దాంతో తమ బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఫండ్రైజింగ్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఈ విషయం కేఎల్ రాహుల్కు తెలిసింది. అంతే ఆ చిన్నారి ప్రాణం కాపాడేందుకు ముందుకొచ్చిన ఈ స్టార్ ఓపెనర్.. ఏకంగా రూ.31 లక్షలు విరాళం ప్రకటించాడు. ఈ డబ్బుతో వరద్ శస్త్రచికిత్స జరిగింది.
‘‘నాకు వరద్ పరిస్థితి తెలియగానే మా టీం వెంటనే గివ్ఇండియా వారితో మాట్లాడింది. వరద్కు ఏమైనా సాయం చేయగలమా? అని తెలుసుకున్నాం. ఆపరేషన్ విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉంది. వరద్ త్వరగా కోలుకోవాలని, అతని కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటున్నా’’ అని రాహుల్ అన్నాడు.
అంత పెద్ద మొత్తం విరాళమిచ్చి తన బిడ్డను కాపాడినందుకు రాహుల్కు వరద్ తల్లి ధన్యవాదాలు తెలిపింది. రాహుల్ సాయం లేకుంటే తన బిడ్డకు అంత త్వరగా ఆపరేషన్ చేయించలేకపోయేవాళ్లమని చెప్పింది. ఈ విషయం తెలిసిన రాహుల్ అభిమానులు.. రాహుల్ పెద్ద మనసును కొనియాడుతున్నారు.