India Open: ఇటీవలే కౌలాలంపూర్ వేదికగా ముగిసిన మలేషియా ఓపెన్లో రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ స్వదేశంలో కూడా విఫలమయ్యాడు. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో శ్రీకాంత్… 22-24, 13-21 తేడాతో హాంకాంగ్కు చెందిన లీ చెక్ యూ చేతిలో ఓడిపోయాడు. తొలి సెట్లో హోరాహోరిగా పోరాడిన శ్రీకాంత్.. రెండో సెట్లో మాత్రం చేతులెత్తేశాడు. పదే పదే బంతిని నెట్కు ఆడుకుని మూల్యం చెల్లించుకున్నాడు. మంగళవారం దేశ రాజధానిలో మొదలైన ఈ పోటీలలో మరో భారత స్టార్ ఆటగాడు లక్ష్యసేన్ కూడా తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. పురుషుల డబుల్స్లో భారత స్టార్ డబుల్స్ ద్వయం సాత్విక్ – చిరాగ్లు రెండో రౌండ్కు చేరారు.
మంగళవారం ప్రపంచ 18వ ర్యాంకర్ అయిన లీ చెక్తో తలపడ్డ శ్రీకాంత్.. తొలి సెట్లో నువ్వా నేనా అన్నట్టుగా పోరాడాడు. ఒకదశలో ఇరువురు 17-17తో సమంగా ఉన్నా లీ మూడు గేమ్ పాయింట్స్ సాధించడంతో అతడు పైచేయి సాధించాడు. తర్వాత శ్రీకాంత్ పుంజుకున్నా రెండు పాయింట్ల ఆధిక్యంతో లీ.. తొలి సెట్ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో మరింత రెచ్చిపోయిన హాంకాంగ్ ప్లేయర్.. సెట్తో పాటు గేమ్నూ సొంతం చేసుకున్నాడు.
ఇదే టోర్నీలో పురుషుల డబుల్స్లో భారత స్టార్ డబుల్స్ ద్వయం సాత్విక్ – చిరాగ్లు రెండో రౌండ్కు చేరారు. తొలి రౌండ్లో ఈ జోడీ.. 21-15, 19-21, 21-16 తేడాతో లీ ఫంగ్ చి – లీ ఫంగ్ జెన్ (తైవాన్) ను ఓడించారు. మరో భారత జోడీ ప్రతీక్ – కృష్ణ ప్రసాద్.. 14-21, 11-21 తేడాతో ఒకమురా-మిస్తుహాషి (జపాన్) జోడీ చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల డబుల్స్లోనూ భారత్కు నిరాశ తప్పలేదు. అయూష్ భట్ – శ్రీరామ్ గౌతమ్ల జంట 12-21, 3-21 తేడాతో సౌత్ కొరియన్ జోడీ కిమ్-కాంగ్ల చేతిలో ఓడింది. మరో పోరులో భారత స్టార్ ద్వయం తనీషా క్రాస్టో – అశ్విని పొన్నప్ప లు 5-21, 21- 18, 11-21 తేడాతో రవీండా – కిటితరకుల్ చేతిలో పరాజయం మూటగట్టుకుంది.