హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఖేలోఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. పంచకుల(హర్యానా) వేదికగా జరుగుతున్న టోర్నీలోయువ వెయిట్లిఫ్టర్ ధనావత్ గణేశ్, మాయావతి కాంస్య పతకాలతో మెరిశారు. మంగళవారం జరిగిన బాలుర అండర్-18 81 కిలోల విభాగంలో బరిలోకి దిగిన గణేశ్.. స్నాచ్లో 123 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్లో 156 కిలోలు, మొత్తంగా 279 కిలోలు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థి అయిన గణేశ్ గత కొంత కాలంగా జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు. అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకున్న గణేశ్ను కోచ్ మాణిక్యాల రావు అభినందించాడు. ఇదే విభాగంలో వల్లూరి (మధ్యప్రదేశ్), త్రిదీప్ (అస్సాం) వరుసగా స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. మరోవైపు బాలికల అండర్-18 100మీటర్ల రేసులో రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి మాయావతి 12.23 సెకన్ల టైమింగ్తో మూడో స్థానంలో నిలిచింది. సుదీక్ష , అవంతిక (మహారాష్ట్ర) పసిడి, రజత పతకాలు ఖాతాలో వేసుకున్నారు. మాయావతిని ఎస్సీ గురుకులాల కార్యదర్శి రొనాల్డ్ రాస్ ప్రత్యేకంగా అభినందించారు. ఖేలోఇండియాలో ఇప్పటి వరకు తెలంగాణకు రజతం సహా 3 కాంస్య పతకాలు లభించాయి.