Kapil Dev | టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ నెల 30వ తేదీన ఢిల్లీ నుంచి రోర్కీ వెళ్తుండగా అతను ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై డివైడర్ను ఢీ కొట్టింది. ప్రమాదం తర్వాత కారులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పంత్ వెంటనే కారు అద్దాలు పగులగొట్టి బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. కాగా, ఈ ఘటనపై లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. ఇదో గుణపాఠం అంటూ చెప్పుకొచ్చారు.
ఇటీవల ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘‘ఇదొక గుణ పాఠం. నేను కూడా కెరీర్ మొదట్లో మోటారు సైకిల్ ప్రమాదానికి గురయ్యాను. ఆ రోజు నుంచి నా సోదరుడు నన్ను బైక్ను ముట్టనివ్వలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే సందర్భంలో ఇతర స్టార్ క్రికెటర్స్కి పలు సూచనలు చేశారు.
‘నీ దగ్గర అద్భుతమైన కార్లు ఉన్నాయి. అవి చాలా వేగంగా దూసుకెళ్తాయి. కానీ, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ డ్రైవర్ను నియమించుకోవడం నీకు భారం కాదు. నీవు సొంతంగా కారును నడపకూడదు. ఎవరికైనా ఈ తరహా కోరికలు ఉంటాయి. ఈ వయసులో ఉన్న వారికి ఇలాంటి కోరికలు ఉండడం సహజమే. కానీ, నీకంటూ బాధ్యతలు ఉన్నాయి. నీ గురించి నీవే జాగ్రత్తలు, తగిన నిర్ణయాలు తీసుకోవాలి’ అని కపిల్ దేవ్ పేర్కొన్నారు. ఏది ఏమైనా ఆ దేవుడి దయవల్ల రిషబ్ ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయడపడ్డాడు అని అన్నారు.