రాంచీ: జార్ఖండ్ యువ వికెట్కీపర్, బ్యాటర్ రాబిన్ మింజ్ గాయపడ్డాడు. శనివారం జరిగిన ప్రమాదంలో రాబిన్ ప్రయాణిస్తున్న బైక్ను గుర్తుతెలియని వ్యక్తి ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రైవేట్ దవాఖానలో ప్రస్తుతం రాబిన్ చికిత్స పొందుతున్నాడని అతని తండ్రి ఫ్రాన్సిస్ మింజ్ మీడియాకు వెల్లడించాడు. ‘రాబిన్ కోలుకుంటున్నాడు. అతనికి పెద్ద గాయాలు ఏం కాలేదు. త్వరలోనే పూర్తిస్థాయిలో తేరుకుని బయటకు వస్తాడు’ అని పేర్కొన్నాడు.
ఇటీవల కర్ణాటకతో జరిగిన సీకే నాయుడు టోర్నీ క్వార్టర్స్లో రాబిన్ మింజ్ 137 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కర్ణాటక సెమీస్కు అర్హత సాధించగా, జార్ఖండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే రానున్న ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున రాబిన్ బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ వేలంలో ఈ యువ క్రికెటర్ను గుజరాత్ 3.6 కోట్లకు తీసుకుంది. రాబిన్ తండ్రి ఫ్రాన్సిస్ మింజ్ రాంచీ ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన కొడుకు ఏ రోజైనా జాతీయ జట్టుకు ఆడాలని అభిలషిస్తున్నాడు.