టెస్టు జట్టు కెప్టెన్గా తప్పుకుంటూ విరాట్ కోహ్లీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో తర్వాతి సారధి ఎవరనే అంశంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను ఆటోమేటిక్ చాయిస్గా అందరూ అనుకుంటున్నారు. అయితే వయసు, ఫిట్నెస్, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వేరే ఎవరికైనా రెడ్ బాల్ కెప్టెన్సీ అప్పగించాలని మరికొందరు అంటున్నారు.
దీనికోసం ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కేఎల్ రాహుల్. అదే సమయంలో ఎవరూ ఊహించని విధంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరు కూడా తెరమీదకొచ్చింది. దీనికి ప్రధాన కారణం సౌతాఫ్రికా వన్డే సిరీస్లో భారత జట్టుకు అతన్ని వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడమే. అంతేకాదు, ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్లో ప్యాట్ కమిన్స్ 4-0తో ఇంగ్లండ్ జట్టును వైట్ వాష్ చేయడం కూడా ఒక కారణం.
ఇదే విషయాన్ని బుమ్రా ముందు ప్రస్తావిస్తే.. నిజంగా ఆ అవకాశం వస్తే అంతకంటే కావలసింది ఏముంటుందని అన్నాడు. జట్టుకు ఎటువంటి స్థానంలో, ఎలా సహకారం అందించడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు బుమ్రా చెప్పాడు. అవకాశం వస్తే సారధ్యం గురించి కూడా ఆలోచిస్తామని, కానీ దానికోసం ఎక్కువ ఆలోచించనని వెల్లడించాడు.
ఆ స్థానం ఉన్నా లేకపోయినా తన పని తాను చేసుకుపోతూనే ఉంటానన్నాడు. అలాగే సఫారీలతో జరిగే వన్డే సిరీస్లో కెప్టెన్ రాహుల్కు ఒక బౌలర్ దృష్టికోణం నుంచి పరిస్థితిని వివరించడం, ఫీల్డింగ్ గురించి చర్చించడం తన బాధ్యత అన్నాడు. కొత్త కుర్రాళ్ల నుంచి సలహాలు తీసుకోవడానికి కూడా తానెప్పుడూ వెనుకాడనని పేర్కొన్నాడు.