హుబ్లీ: రంజీ ట్రోఫీలో తొలిసారి ఫైనల్ చేరిన జమ్మూకశ్మీర్ తమ మొదటి ప్రయత్నంలోనే టైటిల్ను దక్కించుకుని సరికొత్త చరిత్ర లిఖించేందుకు అడుగుదూరంలో నిలిచింది. కర్ణాటకతో హుబ్లీలో జరుగుతున్న ఫైనల్లో భాగంగా తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టుకు 291 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. అదీగాక రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చిన జమ్మూకశ్మీర్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 186/4తో నిలిచింది. కమ్రాన్ ఇక్బాల్ (94 బ్యాటింగ్) శతకానికి చేరువలో ఉన్నాడు. మొత్తంగా ఆ జట్టు 477 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 220/5తో నాలుగో రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక.. మరో 73 పరుగులు మాత్రమే జతచేసి 293 రన్స్కు ఆలౌట్ అయింది.
మయాంక్ అగర్వాల్ (160), కృష్ణ (36) నిష్క్రమించాక ఆ జట్టు కుప్పకూలడానికి పెద్దగా సమయం పట్టలేదు. కశ్మీర్ పేస్ సంచలనం అకిబ్ నబీ (5/54) మరోసారి ఐదు వికెట్ల ప్రదర్శనకు తోడు సునీల్ (2/51), యుధ్వీర్ (2/75) కర్ణాటకను కోలుకోనీయలేదు. నబీకి రంజీల్లో ఐదు వికెట్లు తీయడం ఇది 15వ సారి కాగా ఈ సీజన్లో మొత్తంగా అతడు 60 వికెట్లు పడగొట్టడం గమనార్హం. 92 ఏండ్ల రంజీ చరిత్రలో ఒక పేసర్ ఒక సీజన్లో 60 వికెట్లు పడగొట్టడం ఇది మూడోసారి మాత్రమే. ఈ మ్యాచ్లో కర్ణాటక గెలుపు అసాధ్యమైన వేళ.. ఫైనల్ డ్రా గా ముగిసినా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో జమ్మూకశ్మీర్ తమ మొదటి రంజీ ట్రోఫీని దక్కించుకోవడం ఇక లాంఛనమే!