Shreyas Iyer : భారత జట్టు స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ఇంగ్లండ్ సిరీస్(England Series)కు దూరం కానున్నాడు. తొలి రెండు టెస్టుల్లో విఫలయమైన అయ్యర్కు వెన్నునొప్పి(Back Pain) తిరగబెట్టడమే అందుకు కారణం. దానికి తోడూ గజ్జల భాగంలో కూడా నొప్పి ఉండడంతో ఈ స్టార్ బ్యాటర్కు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయ్యర్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో ఉన్నాడు. ఎన్సీఏ మేనేజ్మెంట్ అయ్యర్ ఫిట్నెస్పై బీసీసీఐకి లేఖ రాసినట్టు సమాచారం.
వెన్నునొప్పి కారణంగా నిరుడు పలు కీలక టోర్నీలకు దూరమైన అయ్యర్ ఆసియా కప్తో రీ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీరాగానే మెరుపు ఇన్నింగ్స్లతో నాలుగో స్థానంలో తనకు తిరుగులేదని చాటుకున్నాడు. ఆ తర్వాత స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్లోనూ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. దాంతో, టెస్టు జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. కానీ, సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం భారీ స్కోర్లు కాదు కదా.. కనీసం హాఫ్ సెంచరీ కొట్టలేకపోతున్నాడు.
శ్రేయస్ అయ్యర్
దక్షిణాఫ్రికా పర్యటనలో నిరాశపరిచిన అయ్యర్ ఇంగ్లండ్ సిరీస్లో తేలిపోయాడు. నిరాశపరుస్తున్నాడు. వరల్డ్ కప్ తర్వాత ఎనిమిది టెస్టు ఇన్నింగ్స్ల్లో వరుసగా.. 31, 6, 0, 4 నాటౌట్, 35, 12, 27, 29 రన్స్ సాధించాడంతే. దాంతో, అతడిపై వేటు వేసి సర్ఫరాజ్ ఖాన్ను ఆడించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులు ముగియడంతో చివరి మూడు టెస్టులకు బీసీసీఐ త్వరలోనే స్క్వాడ్ను ప్రకటించనుంది. తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లీ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడనే వార్తల నేపథ్యంలో రజత్ పాటిదార్(Rajat Patidar)ను కొనసాగించే చాన్స్ ఉంది. వైజాగ్ టెస్టులో నిప్పులు చెరిగిన బుమ్రాకు విశ్రాంతినివ్వనున్నారు. గాయం కారణంగా వైజాగ్ టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాల ఫిట్నెస్ సాధిస్తారా? లేదా? చూడాలి. భారత్, ఇంగ్లండ్ల మధ్య కీలకమైన మూడో టెస్టు రాజ్కోట్లో ఫిబ్రవరి 15వ తేదీన జరుగనుంది.