గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్ స్టేజ్ లో భారత్-పాకిస్తాన్ మధ్య జరగిన మ్యాచ్ లో టీమిండియా పది వికెట్ల తేడాతో దారుణ పరాజయం పాలైంది. అయితే ఈసారి ఇండియాను ఓడించడం మాత్రం అంత ఈజీ కాదని అంటున్నాడు ఆ జట్టు మాజీ పేసర్ షోయభ్ అక్తర్. ఈసారి ఇండియా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతుందని బాబర్ ఆజమ్ సేనకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
ఈ మ్యాచ్ పై ఇప్పటికే హైప్ వస్తున్న నేపథ్యంలో అక్తర్ మాట్లాడుతూ.. ‘ఈసారి టీమిండియా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతుంది. రాబోయే టీ20 ప్రపంచకప్ లో భారత్ ను ఓడించడం పాకిస్తాన్ కు అంత తేలికైన విషయం కాదు..’ అని అన్నాడు.
ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు..? అనేదానిపై ఇరు జట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చలు సాగిస్తున్న తరుణంలో మ్యాచ్ ఫలితం గురించి చెప్పడానికి అక్తర్ నిరాకరించాడు. విజేతను ఇప్పుడే అంచనా వేయడం కష్టమే అని చెప్పుకొచ్చాడు
విజేత ఎవరో తేల్చలేకపోయిన అక్తర్.. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఒకవేళ టాస్ గెలిస్తే మాత్రం రెండోసారి బౌలింగ్ కు దిగాలని సూచించాడు. ‘మెల్బోర్న్ పిచ్ పాతబడే కొద్దీ బౌలర్లకు అనుకూలిస్తుంది. కావున టాస్ గెలిస్తే భారత్ తొలుత బౌలింగ్ తీసుకోకూడదు..’ అని తెలిపాడు. ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ మ్యాచ్ ను వీక్షించడానికి సుమారు లక్షా యాభై వేల మంది ప్రేక్షకులు స్టేడియానికి వస్తారని అక్తర్ తెలిపాడు.
ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్-నవంబర్ లో జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ లో భాగంగా అక్టోబర్ 16న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) లో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా గతేడాది టీ20 ప్రపంచకప్ లో ఓడి స్వదేశం చేరిన తర్వాత రోహిత్ సేన సారథ్యంలో భారత జట్టు అప్రతీహాత విజయాలతో కొనసాగుతున్నది.