టీమిండియా మాజీ సారథి టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నా బీసీసీఐ అతడిని వన్డేల నుంచి తప్పించి ఆ రెండు ఫార్మాట్ల పగ్గాలు రోహిత్ శర్మకు అప్పజెప్పింది. ఇది జరిగిన కొద్దికాలానికి కోహ్లీ టెస్టు కెప్టెన్సీ కూడా వదులుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే బీసీసీఐ ఒత్తిడి చేయడం వల్లే కోహ్లీ.. టెస్టులలో నాయకుడిగా వైదొలిగాడని గతంలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై తాజాగా బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పందిస్తూ అలాంటిదేమీ లేదని వివరణ ఇచ్చాడు.
ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధుమాల్ మాట్లాడుతూ.. ‘కెప్టెన్సీకి సంబంధించినంతవరకు అది కోహ్లీ స్వంత నిర్ణయం. నేను ఇక ఈ పదవిలో కొనసాగలేనని అతడు నిశ్చయించుకున్నాడు. అది పూర్తిగా అతడి వ్యక్తిగతం. దానిని మేం గౌరవించాం. భారత క్రికెట్కు కోహ్లీ ఎనలేని సేవ చేశాడు. అతడేం సాధారణ ఆటగాడు కాదు. గొప్ప క్రికెటర్. ఆ విషయంలో అందరూ అతడిని గౌరవిస్తారు..’ అని అన్నాడు.
కావాల్సినంత విశ్రాంతినిస్తున్నా అతడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో కోహ్లీకి ఆసియా కప్ కీలకం కానున్నదని.. అందులో అతడు రాణించకుంటే టీ20 ప్రపంచకప్ జట్టులో మాజీ సారథిని ఎంపికచేయకపోయినా ఆశ్చర్యం లేదన్న వార్తలపైనా ధుమాల్ స్పందించాడు. ‘కోహ్లీ మళ్లీ గ్రౌండ్లో మెరుపులు మెరిపించాలని మేం భావిస్తున్నాం. అతడిని జట్టులోకి తీసుకోవాలా..? వద్దా..? అనేది మా (బీసీసీఐ) చేతుల్లో లేదు. అది సెలక్టర్లు చూసుకుంటారు. ఆ విషయం (కోహ్లీ ఫామ్)లో ఎలా ముందుకెళ్లాలనేది వాళ్లు నిర్ణయం తీసుకుంటారు..’ అని అన్నాడు.
ఇక సోషల్ మీడియా వేదికగా రోహిత్ వర్సెస్ కోహ్లీ అంటూ జరుగుతున్న చర్చపై ధుమాల్ మాట్లాడుతూ.. ఇదేం కొత్త కాదని చెప్పాడు. గతంలో గవాస్కర్-కపిల్ దేవ్, సచిన్-గంగూలీ విషయంలో కూడా ఇలాంటివి విన్నామని, ఎవరికి తోచినట్టు వారు మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదని ధుమాల్ స్పష్టం చేశాడు.