BCCI | టీమిండియా యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షాకివ్వనుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. జాతీయ జట్టు నుంచి తప్పుకున్న ఈ ఇద్దరూ దేశవాళీలో ఆడాలని బీసీసీఐ పదే పదే ఆదేశించినా ఈ ఇద్దరూ పెడచెవిన పెట్టారు. దీంతో ఈ ఇద్దరి సెంట్రల్ కాంట్రాక్టులను తొలగించనున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. ఈ మేరకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్టులు పొందబోయే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి అందించిందని.. బీసీసీఐ త్వరలోనే దానిని వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. ఇషాన్ గతేడాది డిసెంబర్లో భారత్ తరఫున ఆఖరి మ్యాచ్ ఆడగా శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టులు ఆడాడు. ఈ ఇద్దరూ జాతీయ జట్టు నుంచి తప్పుకున్నా దేశవాళీలో ఆడాలని బీసీసీఐ, టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రావిడ్ పదే పదే కోరినా పట్టించుకోలేదు.
దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్థాంతరంగా స్వదేశానికి వచ్చిన ఇషాన్.. రెండు నెలల నుంచి బోర్డుతో పాటు సెలక్టర్లకు, తన స్టేట్ రంజీ టీమ్ మెంబర్స్తో అంటీముట్టనట్టుగా ఉంటున్నాడు. స్వయంగా రాహుల్ ద్రావిడ్ కూడా ఇషాన్ జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీలో ఆడాలని కోరినా అతడు వినిపించుకోలేదు. ఇషాన్ వ్యవహారంతో బీససీఐ గుర్రుగా ఉంది. అతడి వివాదం నడుస్తున్నప్పుడే బీసీసీఐ కూడా జాతీయ జట్టులో నేరుగా రావడం కుదరదని, కచ్చితంగా దేశవాళీలు ఆడాలని ప్రతి ప్లేయర్కు ఈమెయిల్ ద్వారా ఆదేశాలిచ్చింది. రంజీలలో భాగంగా జార్ఖండ్ జట్టు ఇటీవలే ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడినా ఇషాన్ అందులో పాల్గొనలేదు. బరోడాలో హార్ధిక్ పాండ్యాతో కలిసి కిరణ్ మోరే అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్న వీడియోను గురువారం తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశాడు.
Shreyas Iyer and Ishan Kishan are likely to lose their BCCI’s Central contracts due to skipping Ranji Trophy matches. (TOI) pic.twitter.com/fcNBXVkTWW
— CricketMAN2 (@ImTanujSingh) February 23, 2024
మరోవైపు అయ్యర్.. దక్షిణాఫ్రికాతో పాటు ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులు విఫలమయ్యాడు. మిడిలార్డర్లో రహానే స్థానాన్ని భర్తీచేస్తాడనుకుంటే అయ్యర్ మాత్రం వరుసగా వైఫల్యాలతో విమర్శలపాలయ్యాడు. అదీగాక వైజాగ్ టెస్టు తర్వాత అతడిని పక్కనబెట్టడంతో ముంబై తరఫున రంజీలు ఆడాలని ఆదేశించినా తనకు వెన్నునొప్పి ఉందని చెప్పి దేశవాళీలు తప్పించుకున్నాడు. అతడికి నిర్వహించిన వైద్య పరీక్షలలో మాత్రం అసలు శ్రేయస్కు వెన్ను నొప్పే లేదని బీసీసీఐకి మెయిల్ చేసింది. దీంతో అయ్యర్ది దొంగ గాయం అని తేలింది. రంజీ క్వార్టర్స్ మొదలైనా అయ్యర్ మాత్రం దానికి దూరమయ్యాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ బీసీసీఐ కాంట్రాక్టులు కోల్పోనున్నట్టు సమాచారం.