రెండ్రోజుల క్రితం ఆసియా కప్-2022లో భాగంగా హాంకాంగ్తో ముగిసిన మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కు రాకముందు.. వచ్చిన తర్వాత అన్నట్టుగా సాగింది. టీ20లలో చెలరేగి ఆడుతున్న ఈ నయా మిస్టర్ 360.. జులైలో ఇంగ్లండ్, ఆగస్టులో వెస్టిండీస్ పర్యటనల్లోనూ ఇదే దూకుడును కొనసాగించాడు. దీంతో టీమిండియా అభిమానులంతా అతడిని టీ20లలో భారత జట్టు నెంబర్ వన్ ఆటగాడిగా కీర్తిస్తున్నారు. మరి ఇందులో వాస్తవమెంత..? గణాంకాలు ఏం చెబుతున్నాయి..?
ఐపీఎల్ మెరుపులతో సూర్యకుమార్ యాదవ్ 2021లో భారత టీ20 జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతడి అరంగేట్రం నుంచి చూసుకుంటే టీమిండియాలో అత్యధిక పరుగులతో పాటు సగటు, స్ట్రైక్ రేట్ లోనూ సూర్యనే మిగిలిన అగ్రశ్రేణి బ్యాటర్లకంటే ముందున్నాడు.
2021 నుంచి ఇప్పటివరకు సూర్య మొత్తంగా 25 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 23 ఇన్నింగ్స్లలో బ్యాటింగ్ చేసి 758 పరుగులు చేశాడు. సగటు 39.89గా ఉంది. ఇందులో ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలున్నాయి. ఈ జాబితాలో రోహిత్ శర్మ.. 26 ఇన్నింగ్స్ (సూర్య ఎంట్రీ నుంచి మాత్రమే)లలో 747 పరుగులు చేశాడు. రోహిత్ కూడా 6 హాఫ్ సెంచరీలు చేశాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (19 ఇన్నింగ్స్ లలో 543 పరుగులు, 4 హాఫ్ సెంచరీలు), శ్రేయాస్ అయ్యర్ (19 ఇన్నింగ్స్ లలో 533) ఉన్నారు. విరాట్ కోహ్లీ 13 ఇన్నింగ్స్లలో 474 రన్స్ చేశాడు. ఈ అందరిలో ఒక్క విరాట్ కోహ్లీ సగటు (59.25) మాత్రమే సూర్య కంటే ఎక్కువగా ఉంది.
ఇక ఈ ఏడాది ఇప్పటివరకు టీ20లలో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్ల జాబితా చూస్తే అందులోనూ సూర్యనే ముందున్నాడు. ఈ ఏడాది 14 ఇన్నింగ్స్ లో సూర్య.. 514 పరుగులు చేశాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ (14 ఇన్నింగ్స్, 449 పరుగులు), రోహిత్ శర్మ (15 ఇన్నింగ్స్, 323) ఉన్నారు.
స్టైక్ రేట్ పరంగా సూర్య.. భారత జట్టులో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. గడిచిన 14 ఇన్నింగ్స్లో మిస్టర్ 360 స్ట్రైక్ రేట్ 190.37గా ఉంది. ఆ తర్వాత దీపక్ హుడా (161.17), హార్ధిక్ పాండ్యా (144.03), శ్రేయాస్ అయ్యర్ (142.99), జడేజా (141.54), రోహిత్ శర్మ (135.71) ఉన్నారు.
గణాంకాలను బట్టి చూస్తే పొట్టి ఫార్మాట్ లో సూర్య నెంబర్ వన్ బ్యాటర్ అనడంలో సందేహమే లేదు. అయితే పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటంలో అతడింకా వెనుకబడే ఉన్నాడు. దూకుడుగా ఆడే క్రమంలో కీలక సమయాల్లో ఔటై నిరాశపరుస్తున్నాడు. ఆ బలహీనతను అధిగమిస్తే మిడిలార్డర్లో టీమిండియాకు బలమైన బ్యాటర్ దొరికినట్టే.