ఇంతింతై వటుడింతై అన్నట్టుగా 15 ఏండ్ల కాలంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL ) శిఖరాలకు చేరింది. క్రికెట్ ఆడని దేశాలలో ఫుట్బాల్, బాస్కెట్ బాల్, బేస్ బాల్ లీగ్ లకు ఉండే క్రేజ్, విలువనూ దాటుకుని ముందుకు దూసుకెళ్లుతున్నది. తాజాగా మీడియా హక్కుల వేలంలో భాగంగా ఒక్కో మ్యాచ్ విలువ రూ. 107.5 కోట్లకు చేరడంతో ఐపీఎల్ పాత రికార్డులు బద్దలుకొట్టింది. ఒక్కో మ్యాచ్ విలువలో ఐపీఎల్.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ( EPL ) ను వెనక్కినెట్టి టాప్-5 లీగ్ లలో రెండో స్థానానికి ఎగబాకింది.
ఒక్కో మ్యాచ్ విలువ విషయంలో ఐపీఎల్ టీవీ ప్రసారాలు (రూ. 57.5 కోట్లు), డిజిటల్ (రూ. 50 కోట్లు) హక్కులు కలిపి మొత్తంగా రూ. 107.5 కోట్లు దక్కించుకుంది. కాగా ఈపీఎల్ లో ఒక మ్యాచ్ విలువ రూ. 85 కోట్లుగా ఉంది. ఐపీఎల్ కంటే అత్యధికంగా మ్యాచ్ కు రూ. 133 కోట్లు వసూలు చేస్తుంది నేషనల్ ఫుట్బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) మాత్రమే.
ప్రపంచంలో టాప్-5 స్పోర్ట్స్ లీగ్స్.. ఒక్కో మ్యాచ్ విలువ
ఎన్ఎఫ్ఎల్: అమెరికాలో ప్రఖ్యాతిగాంచిన ఫుట్బాల్ లీగ్. 32 జట్లు పోటీ పడతాయి. ఒక్కో మ్యాచ్ విలువ రూ. 133 కోట్లు
ఐపీఎల్ : పది జట్లు పోటీ పడతాయి. ఒక్కో మ్యాచ్ విలువ రూ. 107.5 కోట్లు
ఈపీఎల్ : ఇంగ్లాండ్ లో ప్రముఖ ఫుట్బాల్ లీగ్. 20 క్లబ్స్ ఆడతాయి. మ్యాచ్ విలువ రూ. 85 కోట్లు
ఎంఎల్బీ : అమెరికాలో పేరుగాంచిన మేజర్ బేస్బాల్ లీగ్ లో 15 టీమ్స్ పాల్గొంటాయి. మ్యాచ్ విలువ రూ. 85 కోట్లు
ఎన్బీఎ : యూఎస్ లో జనాదరణ పొందిన నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఇది. మ్యాచ్ విలువ రూ. 15 కోట్లు
పైన పేర్కొన్నవాటిలో ఐపీఎల్ మినహా మిగిలిన లీగ్స్ అన్నీ 1990కు ముందు పుట్టినవే. వాటితో పోల్చితే ఐపీఎల్ కొత్తది. కానీ ఆనతికాలంలోనే ఐపీఎల్ శిఖరాలకు చేరుకుని దిగ్గజ లీగ్ లతో తలపడుతుండటం గమనార్హం.