న్యూఢిల్లీ: ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ రద్దవడంపై ఇప్పటికీ చర్చలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ దిలీప్ దోషి కూడా దీనిపై స్పందించాడు. అయితే అతడు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ గందరగోళం అంతటికీ కారణమైన బుక్ లాంచ్ ఈవెంట్ గురించి దిలీప్ వివరించాడు. ఆ ఈవెంట్లో తాను కూడా ఉన్నానని, అయితే ఒక్క ఇండియన్ ప్లేయర్ కూడా మాస్కు పెట్టుకోకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని దోషి చెప్పాడు. ఆ ఈవెంట్లో చాలా మంది ఉన్నారని, వాళ్ల మధ్యలో ప్లేయర్స్ మాస్క్ పెట్టుకోకపోవడాన్ని అతడు ప్రశ్నించాడు.
యూకే అంతా ఓపెన్ అయింది కదా అని తాము కూడా బుక్ లాంచ్ ఈవెంట్కు వెళ్లినట్లు తనను తాను సమర్థించుకున్న రవిశాస్త్రి వ్యాఖ్యలపైనా దోషి స్పందించాడు. అక్కడి రాజకీయ నాయకులు తీసుకున్న నిర్ణయం అదని, అయితే ఓ టూరిస్టుగా మనం ఏ మిషన్ కోసమైతే వెళ్లామో అది పూర్తయ్యే వరకూ మన జాగ్రత్తలో మనం ఉండటం ముఖ్యమని దోషి అన్నాడు. ఇక ఐదో టెస్ట్ రద్దు వెనుక ఐపీఎల్ కూడా ఒక కారణం కావచ్చని దోషి సందేహం వ్యక్తం చేయడం గమనార్హం.
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్తో తాను మాట్లాడానని, బీసీసీఐకి చివరి టెస్ట్ జరగడం ఇష్టం లేదని అతడు చెప్పినట్లు దోషి తెలిపాడు. దీనివల్ల ఐపీఎల్కు కాస్త ఎక్కువ సమయం దొరుకుతుందని ఇండియన్ బోర్డు భావించిందని, అయితే దానికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఒప్పుకోకపోయి ఉండొచ్చని తాను అనుకుంటున్నట్లు హోల్డింగ్ చెప్పాడని దోషి అన్నాడు.
చివరి టెస్ట్ కూడా జరిగి ఆ తర్వాత ఏదైనా ఊహించనిది జరిగిన కారణంగా ఐపీఎల్ రద్దయితే భారీ నష్టాలు తప్పవని బీసీసీఐ భావించి ఉండొచ్చు. ఈ రోజుల్లో క్రికెట్ను డబ్బే నడిపిస్తోంది. అన్ని బోర్డులూ అంతే. అందులోనూ ఎక్కువ మొత్తం ఇండియా నుంచే వస్తోంది. కాబట్టి బీసీసీఐ హవా నడుస్తోంది. అయితే దాంతోపాటే వారిపై గురుతర బాధ్యత కూడా ఉంటుంది. దానిని నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అది చాలా ముఖ్యం అని దోషి అన్నాడు.