Sanju Samson | వరుస విజయాలతో జోరుమీదున్న రాజస్థాన్ రాయల్స్కు గుజరాత్ టైటాన్స్ బ్రేకులు వేసింది. ఈ సీజన్లో సంజు శాంసన్ నేతృత్వంలోని జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. అదే సమయంలో కెప్టెన్ శాంసన్ ఐపీఎల్ మేనేజ్మెంట్ షాక్ ఇస్తూ భారీగా జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. రూ.12లక్షల జరిమానా విధించారు. బుధవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ను గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో ఓడించింది.
ఈ సీజన్లో రాజస్థాన్కు ఇదే తొలి ఓటమి. ఇంతకు ముందు వరుసగా నాలుగు మ్యాచుల్లో విజయం సాధించిన రాజస్థాన్ జట్టును శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ జట్టు కట్టడి చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. చివరి రెండు ఓవర్లలో రషీద్ ఖాన్ మ్యాచ్ ఫలితాన్నే మార్చివేశాడు. ఈ విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకున్నది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో ఆరు పాయింట్లున్నాయి.
ఇప్పటి వరకు ఆరో స్థానంలో ఉన్న పంజాబ్ ఏడో స్థానంలోకి చేరింది. అయితే, మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ.. రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఐదు మ్యాచులు ఆడిన శాంసన్ జట్టు నాలుగు విజయాలు, ఓటమితో ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్కు ఇదే తొలి జరిమానా కాగా.. రూ.12లక్షల జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక రాజస్థాన్ జట్టు ఈ నెల 13న పంజాబ్ కింగ్స్తో తలపడనున్నది. ఇక గుజరాత్ జట్టు17న ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ ఆడనున్నది.