Rohit – Hardik | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్లో ముంబై ఇండియన్స్కు సారథిగా వ్యవహరించనున్న హార్ధిక్ పాండ్యా.. ఆ జట్టుకు కెప్టెన్గా నియమితుడై రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకూ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో మాట్లాడలేదట. ఈ విషయాన్ని స్వయంగా హార్ధికే వెల్లడించాడు. రోహిత్ గత కొంతకాలంగా టెస్టు సిరీస్ (ఇంగ్లండ్తో) కోసం నిత్యం ప్రయాణం చేస్తూనే ఉన్నాడని, అందుకే అతడితో మాట్లాడే వీలు దొరకలేదని అన్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి నాలుగు రోజుల ముందు ముంబై ఇండియన్స్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో హార్ధిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ముంబై హెడ్కోచ్ మార్క్ బౌచర్తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న పాండ్యా మాట్లాడుతూ.. ‘అతడు (రోహిత్) చాలారోజులుగా బిజీ షెడ్యూల్ కారణంగా ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు. ఇటీవల కాలంలో మేమిద్దరం ఎదురెదురుగా ఉండి మాట్లాడుకునే అవకాశం కూడా రాలేదు. త్వరలోనే అతడు ముంబై క్యాంప్లో జాయిన్ అవుతాడు. అప్పుడు రోహిత్తో మాట్లాడతా..’ అని అన్నాడు.
అతడి మద్దతు ఉంటుంది..
తాను కెప్టెన్ అయినప్పటికీ రోహిత్ తనకు ఎప్పుడూ అండగా ఉంటాడని, రాబోయే టీ20 వరల్డ్ కప్లో అతడి సారథ్యంలోనే తాను భారత జట్టుకు ఆడాల్సి ఉందని పాండ్యా చెప్పాడు. ‘కెప్టెన్సీ మార్పుతో భిన్నంగా ఏమీ ఉండదు. రోహిత్ నాకు సాయం చేసేందుకు నిత్యం నాకు మద్దతుగా ఉంటాడు. నాకు అవసరమైనప్పుడల్లా నా భుజం తడతాడు. నేను నా కెరీర్ను అతడి హయాంలోనే అరంగేట్రం చేయడమే గాక రాబోయే టీ20 వరల్డ్ కప్లో కూడా అతడి సారథ్యంలోనే ఆడాల్సి ఉంటుంది..’ అని చెప్పాడు.
అభిమానుల ఎమోషన్స్ను గౌరవిస్తా..
ముంబై జట్టు కెప్టెన్సీ మార్పుపై రోహిత్ ఫ్యాన్స్తో పాటు ఆ ఫ్రాంచైజీ అభిమానులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది అభిమానులు ముంబై ఇండియన్స్ జెండా తగలబెట్టడం, ఆ ఫ్రాంచైజీని అన్ఫాలో చేయడం వంటివి అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. దీనిపై హార్ధిక్ మాట్లాడుతూ… ‘కెప్టెన్ను మార్చిన తర్వాత కొంతమంది అభిమానులు అసహనంతో ఉన్నారన్న విషయం నా దృష్టికీ వచ్చింది. నేను వాళ్ల ఎమోషన్స్ను గౌరవిస్తాను. కానీ నేను నియంత్రించగలిగేది మాత్రమే నియంత్రిస్తా. నా చేతుల్లో లేనిదానిని నేను ఏమీ చేయలేను. నేను పూర్తిగా ఆటమీదే దృష్టి సారిస్తా..’ అని తెలిపాడు.