IPL 2023 Prize Money : అతిపెద్ద క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) పదహారో సీజన్ విజేత ఎవరో రేపటితో తేలిపోనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాత్రి 7ః30 గంటలకు టైటిల్ పోరు జరగనుంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తలపడనున్నాయి. దాంతో, ఈసారి ట్రోఫీ విజేతకు ఎంత ప్రైజ్ మనీ దక్కనుంది? అనే చర్చ అభిమానుల్లో మొదలైంది. అయితే.. గత సీజన్ కంటే ఈసారి చాంపియన్గా నిలిచిన జట్టు రికార్డు స్థాయిలో రూ. 46.5 కోట్లు అందుకోనుందని టాక్.
పదిహేనో సీజన్లో కప్పు గెలిచిన గుజరాత్ టైటాన్స్కు రూ. 20 కోట్లు దక్కాయి. రన్నరప్గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ టీమ్కు రూ. 13 కోట్లు ముట్టాయి. ప్లే ఆఫ్స్ చేరిన రెండు జట్లు రూ. 7 కోట్లు అందుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్స్లో ఐపీఎల్కు క్రేజ్ ఎక్కువ. బ్రాండ్, ప్రకటనలు, మీడియా రైట్స్ రూపంలో వచ్చే ఆదాయం కూడా ఎక్కువే. దాంతో నిర్వాహకులు ప్రైజ్మనీని కూడా పెంచారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ను 2008లో బీసీసీఐ(BCCI) ప్రారంభించింది. తొలి సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్కు రూ. 4.8 కోట్ల ప్రైజ్మనీ దక్కింది. రన్నరప్కు రూ. 2.4 కోట్లు ముట్టాయి. రెండో సీజన్ విన్నర్కు కూడా రూ. 4.8 కోట్లు, రెండో స్థానంలో నిలిచిన జట్టకు రూ.2.4 కోట్లు అందచేసింది. 2010- 13 మధ్య విజేతకు ఇచ్చే ప్రైజ్మనీని రూ.10 కోట్లకు పెంచారు. రన్నరప్గా నిలిచిన టీమ్కు రూ.5 కోట్లు ఇచ్చారు. 2014-15 సీజన్లో చాంపియన్కు రూ. 15 కోట్లు ముట్టజెప్పారు. రెండో స్థానంలోని జట్టుకు రూ. 10 కోట్లు అందాయి. 206 -19 మధ్య ప్రైజ్మనీని రూ. 20 కోట్లకు పెంచారు. అయితే.. కరోనా మహమ్మారి కారణంగా 2020లో విజేతకు ఇచ్చే డబ్బును భారీగా తగ్గించారు. కేవలం రూ.10 కోట్లు ఇచ్చారంతే. రన్నరప్ జట్టు రూ.6.25 కోట్లతో సరిపెట్టుకుంది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఉన్నా కూడా 2021లో విజేతకు తిరిగి రూ.20 కోట్లు ఇచ్చారు.
పదహారో సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి(ఆరెంజ్ క్యాప్ హోల్డర్), అత్యధిక వికెట్లు తీసిన బౌలర్(పర్పుల్ క్యాప్ హోల్డర్)కు రూ. 15 లక్షలు ఇవ్వనున్నారు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపికైన ఆటగాడికి రూ. 20 లక్షలు దక్కుతాయి. అంతేకాదు అత్యంత విలువైన ఆటగాడు రూ. 12 లక్షల ప్రైజ్మనీ సొంతం చేసుకుంటారు.