ఐపీఎల్లో కొత్త జట్లు తొలి అడుగు వేయబోతున్నాయి. ఈ ఐపీఎల్లో కొత్తగా చేరిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటన్స్ జట్లు సోమవారం నాడు తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. ఈ క్రమంలో గుజరాత్ టైటన్స్ జట్టు కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను తమ కెప్టెన్గా ప్రకటించిన గుజరాత్ ఫ్రాంచైజీ.. ఇప్పుడు వైస్ కెప్టెన్గా ఆఫ్ఘన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పేరును ప్రకటించింది.
రషీద్కు నాయకత్వం కొత్తేమీ కాదు. ఆప్ఘన్ కెప్టెన్ గైర్హాజరీలో పలు అంతర్జాతీయ మ్యాచుల్లో జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం అతనికి ఉంది. హార్దిక్కు కెప్టెన్సీ కొత్త కావడంతో.. రషీద్ తన అనుభవాలను హార్దిక్తో పంచుకుంటాడని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఈ మేరకు హార్దిక్, రషీద్ కలిసి నవ్వుతున్న ఫొటోను షేర్ చేసిన గుజరాత్ ఫ్రాంచైజీ.. ‘‘రషీద్ భాయ్ మన వైస్ కెప్టెన్ అయ్యాడు’’ అని పోస్టు చేసింది. దీనిపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.