న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 16వ సీజన్ ప్లేఆఫ్స్తో పాటు ఫైనల్ మ్యాచ్ వేదికలు ఖరారయ్యాయి. క్వాలిఫయర్-2(మే 26)తో పాటు ఫైనల్ పోరు(మే 28) మ్యాచ్కు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మే 23, 24 తేదీల్లో క్వాలిఫయర్-1తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్లు జరుగునున్నాయి. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ కెరీర్కు మహేంద్రసింగ్ ధోనీ వీడ్కోలు పలికే అవకాశమున్న నేపథ్యంలో ప్లేఆఫ్ మ్యాచ్లను చెన్నైకి కేటాయించినట్లు తెలుస్తున్నది. లీగ్లో టాప్-4లో నిలిస్తే చెన్నై సొంతగడ్డపై ఆడే చాన్స్ లభిస్తుంది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికిన 41 ఏండ్ల ధోనీ ఐపీఎల్కు గుడ్బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే చెన్నైలో తన ఆఖరి ఆట ద్వారా వీడ్కోలు చెప్పవచ్చు. బెంగళూరు, గుజరాత్ మధ్య మే 21న జరిగే మ్యాచ్తో ఐపీఎల్లో లీగ్ దశ ముగియనుంది.