పాల్వంచ రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో గురుకులాల సొసైటీ ఇంటర్ లీగ్ పోటీలు మొదలయ్యాయి. పోటీలను సోమవారం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గెలుపోటములకు అతీతంగా ప్రతీ ఒక్కరూ క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో క్రీడలతో పాటు విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. 119 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన గురుకులాల్లో వేలాది మంది విద్యార్థులు ఉత్తమ విద్యను అభ్యసిస్తున్నారు. ఏడు గురుకుల సొసైటీల నుంచి దాదాపు 3200 మందికి పైగా విద్యార్థులు టోర్నీలో పోటీపడుతున్నారు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటేశ్వర్రావు, ఎమ్మెల్సీ మధు, జడ్పీ చైర్మన్ కనకయ్య, కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతమ్, గురుకులాల కార్యదర్శి రొనాల్డ్ రాస్ పాల్గొన్నారు.