న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 2023లో చాలాకాలం ఆటకు దూరంగా ఉండాల్సిందేనా..? కారు ప్రమాదంలో ఆయనకు తగిలిన గాయాలు మానడానికి ఆరు నెలలకుపైగా సమయం పడుతుందా..? ఇప్పటికే శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో ద్వైపాక్షిక సిరీస్లతోపాటు ఐపీఎల్కు కూడా దూరమైన రిషబ్ పంత్.. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే వన్డే వరల్డ్కప్కు కూడా అందుబాటులో ఉండటం అనుమానమేనా..? అంటే ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానమే వస్తుంది.
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో నివేదిక ప్రకారం 2023లో మెజారిటీ కాలం రిషబ్పంత్ ఆటకు దూరంగానే ఉండాల్సి రానుంది. గత డిసెంబర్ 30న జరిగిన కారు ప్రమాదంలో రిషబ్ పంత్ కుడి మోకాలులోని మూడు లిగమెంట్లు దెబ్బతిన్నాయి. ఇప్పటికే రెండు లిగమెంట్లకు సర్జరీ చేసి పునర్నిర్మించిన ముంబై వైద్యులు, ఆరు వారాల విరామం తర్వాత మరో లిగమెంట్కు కూడా సర్జరీ చేసి సరిచేయనున్నట్లు తెలిపారు.
రిషబ్పంత్ గత డిసెంబర్ 30న ఢిల్లీలో తన మెర్సిడెజ్ బెంజ్ కారును స్వయంగా నడుపుకుంటూ వెళ్లి డివైడర్ను డీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కారు పూర్తిగా దగ్ధమైంది. బస్ డ్రైవర్, కండక్టర్ ఆయనను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హెలిక్యాప్టర్లో ముంబైకి తరలించారు. ప్రస్తుతం ముంబైలో పంత్ చికిత్స పొందుతున్నాడు.
రిషబ్పంత్కు కుడి మోకాలులోని మూడు కీలక లిగమెంట్లు దెబ్బతినడమేగాక, కుడి చేతి మణికట్టుకు, మోచేతికి కూడా గాయాలయ్యాయని బీసీసీఐ ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది. పంత్ వీపు భాగంలో కూడా చర్మం చీరుకుపోయిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో దాదాపు మెజారిటీ కాలం పంత్ ఆటకు దూరంగానే ఉండాల్సి వస్తుందన్న చర్చ వినబడుతున్నది.