INDWvsENGW: ఇండియా-ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మూడో మ్యాచ్లో భారత్కు ఊరట విజయం దక్కింది. వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్ కూడా నెగ్గి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలనుకున్న ఆ జట్టు ఆధిక్యాన్ని భారత్ 1-2 కి తగ్గించింది. మొదట ఇంగ్లండ్ను బౌలింగ్తో కట్టడిచేసిన భారత్ తర్వాత బ్యాట్తో రాణించి ఊరట విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 127 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన (48 బంతుల్లో 48, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జెమీమా రోడ్రిగ్స్ (33 బంతుల్లో 29, 4 ఫోర్లు) రాణించారు. తొలి రెండు మ్యాచ్లను గెలుచుకున్న ఇంగ్లండ్ సిరీస్ను కూడా సొంతం చేసుకుంది.
ఇంగ్లండ్ నిర్దేశించిన 127 పరుగుల ఛేదనలో భారత్ ఆదిలోనే ఓపెనర్ షఫాలీ వర్మ (6) వికెట్ను కోల్పోయింది. వన్డౌన్లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్తో కలిసి స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన భారత్ను విజయం వైపు నడిపించింది. స్పిన్కు అనుకూలించిన వాంఖడే పిచ్పై ఇంగ్లండ్ బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా నిలకడగా ఆడారు. వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ లైన్ దాటిస్తూనే సింగిల్స్ మీద దృష్టి పెట్టి రన్ రేట్ పడిపోకుండా చూశారు.
గెలుపు దిశగా సాగుతున్న భారత్కు చార్లీ డీన్ షాకిచ్చింది. ఆమె వేసిన 12వ ఓవర్లో జెమీమా వికెట్ల ముందు దొరికిపోయింది. దీంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. రెండో వికెట్కు మంధాన – జెమీమాలు 57 పరుగులు జోడించారు. జెమీమా నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ (12) విఫలమైంది. అర్థసెంచరీకి చేరువైన మంధాన.. ఎకిల్స్టోన్ వేసిన 17వ ఓవర్లో డంక్లీకి క్యాచ్ ఇవ్వడంతో ఆఖర్లో ఉత్కంఠ నెలకొంది. రిచా ఘోష్ ను ఎకిల్స్టోన్ బౌల్డ్ చేసింది. కానీ అమన్జ్యోత్ కౌర్ (4 బంతుల్లో 10 నాటౌట్, 2 ఫోర్లు) ఆఖర్లో రెండు బౌండరీలు బాది భారత్కు విజయాన్ని అందించింది. టీ20 సిరీస్ ముగియడంతో ఇరు జట్ల మధ్య ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఈనెల 14 నుంచి ఏకైక టెస్టు జరగాల్సి ఉంది.