శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. శనివారం జరిగిన రెండో టీ20లో మరో ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించిన హర్మన్ప్రీత్ కౌర్ జట్టు.. సిరీస్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. దంబుల్లా వేదికగా జరిగిన రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన లంకకు మంచి ఆరంభం లభించింది.
ఓపెనర్లు చమారి ఆటపట్టు (43), విష్మి గుణరత్నే (45) ఆ జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా భారత బౌలర్లు పుంజుకున్నారు. దాంతో లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది.
లక్ష్య ఛేదనలో భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (39) ధాటిగా బ్యాటింగ్ చేసింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (31 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చింది. చివరి ఓవర్ తొలి బంతికే బౌండరీతో జట్టుకు విజయాన్నందించింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ను భారత జట్టు 2-0తో కైవసం చేసుకుంది. హర్మన్ప్రీత్కౌర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.