INDvsSA Test: వన్డే ప్రపంచకప్ తర్వాత భారత సీనియర్లంతా ఆడబోతున్న దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ లేకుండానే బరిలోకి దిగుతోందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. డిసెంబర్ 26 నుంచి మొదలుకాబోయే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు షమీ అందుబాటులో ఉండేది అనుమానమేనని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్గాలు తెలిపాయి. వరల్డ్ కప్ సందర్భంగా చీలమండ గాయం అవడంతో అప్పటినుంచి ఇంటికే పరిమితమైన షమీ.. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ వరకూ కోలుకునే అవకాశాలు తక్కువగానే ఉన్నట్టు బోర్గు వర్గాల సమాచారం.
ఇదివరకే దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న యువ భారత్.. టీ20 సిరీస్ ముగిసిన తర్వాత వన్డే సిరీస్కు సిద్ధమవుతోంది. టెస్టు సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్, నవదీప్ సైనీ, హర్షిత్ రాణాలు శుక్రవారం రాత్రి జోహన్నస్బర్గ్కు వెళ్లనున్నారు. కానీ షమీ వీరితో కలిసి వెళ్లడం లేదని తెలుస్తున్నది. వరల్డ్ కప్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న షమీ.. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. మరోసారి అతడి ఫిట్నెస్ను పరీక్షించిన తర్వాతే షమీ సఫారీ టూర్కు వెళ్తాడా..? లేదా..? అన్నది స్పష్టత రానుంది. ఇదే విషయమై బోర్డు ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘షమీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. టెస్టు సిరీస్కు అతడు ఆడేదీ లేనిదీ అతడి ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుంది..’ అని తెలిపాడు.
Shami is likely to be ruled out of the South Africa Test series. [Cricbuzz] pic.twitter.com/DosqsNiygz
— Johns. (@CricCrazyJohns) December 14, 2023
ప్రపంచకప్లో తొలి నాలుగు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన షమీ.. తర్వాత ఏడు మ్యాచ్లలో ఏకంగా 24 వికెట్లు పడగొట్టి భారత్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక భారత్-దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు జరుగనుంది.