INDvsAFG 2nd T20I: ఛేదించాల్సింది 173 పరుగుల లక్ష్యం. తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ డకౌట్. ఆరో ఓవర్లో కోహ్లీ కూడా పెవిలియన్ చేరాడు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న యశస్వి జైస్వాల్ (34 బంతుల్లో 68, 5 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్ దూబే (31 బంతుల్లో 63 నాటౌట్, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అఫ్గాన్ బౌలర్లను ఆటాడుకున్నారు. బంతి దొరికితే సిక్సర్ లేదంటే ఫోర్ అన్నంతగా సాగింది ఈ ఇద్దరి విధ్వంసం. ఎడమ చేతి వాటం బ్యాటర్లు అయిన ఈ ఇద్దరి వీరవిహారంతో అఫ్గాన్.. భారత్ ఎదుట నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యం (15.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించారు) ఏ మూలకూ సరిపోలేదు. మరో 4.2 ఓవర్లు మిగిలుండగానే ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను సొంతం చేసుకుంది.
ముందు కోహ్లీతో..
ఇండోర్ వేదికగా ముగిసిన మ్యాచ్లో అఫ్గాన్ జట్టు ఆనందించిన క్షణాలు రోహిత్, కోహ్లీ ఔటయ్యినప్పుడే. బహుశా ఆ ఇద్దరూ ఉన్నా ఇంత ధాటిగా ఆడలేరేమో అని కచ్చితంగా అనుకుని ఉంటారు ఆ దేశ అభిమానులు. భారీ ఛేదనలో తొలి బంతినే బౌండరీగా మలిచిన జైస్వాల్.. తాను పనిపూర్తిచేసేదాకా ఇక్కడ్నుంచి కదిలేది లేదని అఫ్గాన్ ప్లేయర్లకు హెచ్చరికలు జారీ చేశాడు. రోహిత్ మరోసారి నిరాశపరిచినా విరాట్ కోహ్లీ (16 బంతుల్లో 29, 5 ఫోర్లు) అండతో జైస్వాల్ రెచ్చిపోయారు. ఈ ఇద్దరూ 28 బంతుల్లోనే 57 పరుగులు జోడించారు. ముజీబ్ వేసిన రెండో ఓవర్లో కోహ్లీ రెండు ఫోర్లు కొట్టాడు. తర్వాత ఫరూఖీ వేసిన మూడో ఓవర్లో జైస్వాల్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్లో జైస్వాల్ ఇచ్చిన క్యాచ్ను ఫరూఖీ జారవిడిచాడు. ముజీబ్ వేసిన ఐదో ఓవర్లో తొలి బంతికి కోహ్లీ ఫోర్ కొట్టగా ఇదే ఓవర్లో జైస్వాల్.. హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. ఐదు ఓవర్లకే భారత్ స్కోరు 58-1గా ఉంది. అయితే నవీన్ ఉల్ హక్ వేసిన ఆరో ఓవర్లో రెండో బంతికి బౌండరీ కొట్టిన కోహ్లీ.. మూడో బంతికి ఔట్ చేశాడు.
తర్వాత దూబేతో..
కోహ్లీ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన దూబేతో జైస్వాల్ కలవడంతో అగ్నికి వాయువు తోడైనట్టైంది. ఈ ఇద్దరూ అఫ్గాన్ బౌలర్లకు ఇండోర్లో చుక్కలు చూపించారు. నబీ వేసిన 8వ ఓవర్లో సిక్సర్ కొట్టిన జైస్వాల్.. అతడే వేసిన పదో ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసి 27 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్లో దూబే.. హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. పది ఓవర్లకే భారత్ స్కోరు 115 పరుగులు దాటింది. నూర్ అహ్మద్ వేసిన 11వ ఓవర్లో 4, 6, 6తో జైస్వాల్.. భారత్ను లక్ష్యానికి దగ్గరచేశాడు. ఆ మరుసటి ఓవర్లోనే దూబే.. మూడు ఫోర్లు బాదాడు. దీంతో అతడి అర్థ సెంచరీ కూడా పూర్తయింది. అంతేగాక 13 ఓవర్లకే టీమిండియా స్కోరు 150 దాటింది. ఆ క్రమంలో జైస్వాల్.. కరీమ్ జనత్ వేసిన 13వ ఓవర్లో రెండో బంతికి గుర్బాజ్ చేతికి చిక్కాడు. జైస్వాల్ ఔట్ అయ్యేటప్పటికీ భారత్ విజయానికి 19 పరుగుల దూరంలో నిలిచింది. జితేశ్ శర్మ డకౌట్ అయినా దూబే.. రింకూ సింగ్ (9 నాటౌట్) లు కలిసి భారత్కు ఘన విజయాన్ని అందించారు. ఈ సిరీస్లో మూడో మ్యాచ్ ఈనెల 17న బెంగళూరు వేదికగా జరగనుంది.